BJP : గత కొద్దికాలంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు అవకాశం దొరికితే చాలు తమ పంథా కొనసాగిస్తున్నారు. రాజకీయ కార్యక్రమాల్లో అంటే విమర్శలు సహజం కానీ ఇతర సందర్భాల్లో విమర్శలు సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి జన్మదిన సందర్భంగా 30 మంది నిరుపేద చేనేత కార్మికులకు ఆసు యంత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేతలు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.
BJP డీకే అరుణ నుంచి మొదలై….
సీఎం కేసీఆర్, కేటీఆర్లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు , మాజీ మంత్రి డీకే అరుణ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని…ప్రచారం చేయడం తప్ప కార్మికులకు చేసింది శూన్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో భూదాన్ పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట్ లో ఎంతో మంది చేనేతే కార్మికులు ఉంటే పట్టించుకోవడం లేదని అరుణ ఫైర్ అయ్యారు.
షాడో ముఖ్యమంత్రి కేటీఆర్ శిలా ఫలకం వేయడం తప్ప ఒక అడుగు కూడా ముందు పడటం లేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సిల్క్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ కాదు… బ్రతుకు తెలంగాణ కోసం ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని… తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించేందుకు నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ప్రజల ముఖ్యమంత్రి కాదట
తెలంగాణ ప్రజల ఓట్లు చెప్పులతో పోల్చిన కేసీఆర్ దుర్మార్గుడు అంటూ బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. కేసీఆర్ వారి కుటుంబానికి మాత్రమే ముఖ్యమంత్రి అని.. ప్రజలకు ముఖ్యమంత్రి కాదు అంటూ మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. కేసీఆర్ను పతనం చేయాల్సిన అవసరం ఉంది… దోచుకోవడం, దాచుకోవడం తప్ప కేసీఆర్ ప్రజలకు చేసింది శూన్యం అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని ఆరోపించారు.