Breaking: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) గా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఇక కేసిఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతున్నందున ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.
మంగళవారం టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు కేసిఆర్. ఎన్నికలకు ఏడాది ఉంది..గట్టిగా పోరాడాలని నేతలకు కేసిఆర్ దిశానిర్దేశం చేశారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేసిఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలు అందరూ ఈ రోజు నుండే ప్రజల్లో తిరగాలని కేసిఆర్ సూచించారు. బీజేపీని ఏ విధంగా ఎదుర్కొవాలి, జాతీయ స్థాయి రాజకీయాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నికల్లో పరిణామాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పలు కీలక సూచనలు చేశారు.