Corporate Hospital: హైదరాబాద్ లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు మృత్యువాత పడుతుండటం, లక్షలాది రూపాయలు కట్టించుకుని శవాన్ని అందించడం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, అక్రమాలు అధికారుల తనిఖీల్లోనూ వెల్లడి అవుతున్నాయి. కార్పోరేట్ ఆసుపత్రుల్లో సామాన్య ప్రజలతో పాటు ఆ ఆసుపత్రుల్లో చికిత్సకు వచ్చే వైద్యుల పట్ల అదే దోపిడీ తీరు కనబరుస్తున్నారు అన్న దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అరకోటికిపైగా బిల్లుల రూపంలో చెల్లించినా చివరకు డెడ్ బాడీనే అప్పగించారు. ఆ కార్పోరేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సతీమణి చనిపోయిందంటూ ఓ వైద్యుడే పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడం గమనార్హం.
హైదరాబాద్ శివారు కొంపల్లి ప్రాంతానికి చెందిన డాక్టర్ భావన, డాక్టర్ కల్యాణ్ దంపతులు వైద్య వృత్తిలోని వారే. భావన వివాహం కాకముందు ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో రేడియాలజిస్ట్ గా పని చేసినా వివాహం అయిన తరువాత వృత్తికి దూరంగా ఉన్నారు. డాక్టర్ భావన కరోనా బారిన పడటంతో ఏప్రిల్ 22వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గత నెల 6వ తేదీ వరకూ అదే అసుపత్రిలో చికిత్స పొందగా కరోనా నుండి కోలుకున్నారు. అయితే కోవిడ్ నుండి కోలుకున్న తరువాత అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఎక్మో చికిత్స అవసరం కావడంతో జూబ్లీహిల్స్ లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో భర్త డాక్టర్ కళ్యాణ్ చేర్పించారు. 26 రోజులుగా ఆ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశం ఉండగా భర్త డాక్టర్ కల్యాణ్ ఆసుపత్రి బిల్లు రూ.52 లక్షలు చెల్లించారు.
Read More: Suicide: అవమాన భారంతో భార్య, పిల్లలకు ఉరివేశాడు..! ఆపై తాను ఆత్మహత్య..!!
బుధవారం నాడు ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేకపోవడంతో రెండు మూడు యూనిట్ల రక్తం కారిపోయినా ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని భర్త డాక్టర్ కల్యాణ్ ఆరోపించారు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్ లెవల్ 94గా ఉందనీ, తర్వాత పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయిందని చెప్పారు. అనంతరం ఫ్లూయిడ్ ఓవర్ లోడ్ చేయడంతో గురువారం తెల్లవారుజామున 4.30గంటలకు గుండె పోటుతో డాక్టర్ భావన మృతి చెందిందని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ యువ వైద్యురాలి గుండె ఆగిపోయింది. ఆ విషయాన్ని వైద్యుడైన ఆమె భర్తే ఆరోపించడం విశేషం. దీనిపై బాధితుడు సదరు కార్పోరేట్ ఆసుపత్రిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం మాత్రం పేషంట్ను కాపాడేందుకు తమ ప్రయత్నం తాము చేశామనీ, తమ నిర్లక్ష్యం అంటూ ఏమి లేదని వివరణ ఇస్తున్నది.