మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా వ్యవహారం మరువకముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా ముఖంగా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు దాసోజు శ్రావణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పది మంది జీవితాల్లో వెలుగు నింపాలని రాజకీయాల్లోకి తాను రాజకీయాల్లోకి వచ్చాననీ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అంచెలంచెలుగా ఎదిగే అవకాశం ఇచ్చారని అన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని శ్రావణ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో అరాచకం రాజ్యమేలుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తప్పు చేస్తే అడిగే వారే లేరనీ, రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. సర్వేల పేరుతో తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేస్తున్నారనీ ఆరోపించారు శ్రావణ్. రేవంత్ రెడ్డి, సునీల్, మాణిక్యం ఠాగూర్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రావణ్ రాజీనామా చేస్తున్నారని వార్తలు వెలువడటంతో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. పార్టీ అధిష్టానం ఆయన ఇంటికి సీనియర్ నేతలు కోదండరెడ్డి, మహేశ్ గౌడ్ లతో కూడిన బృందాన్ని పంపించింది. అయితే వీరి బుజ్జగింపులకు ఆయన మెత్తబడలేదు. కోదండరెడ్డి బృందం తన ఇంటి నుండి వెళ్లిపోయిన వెంటనే శ్రావణ్ తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రావణ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. అయితే ఇటీవలే దివంగత నాయకుడు పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ లో చేరికపై శ్రావణ్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
అన్న మావోడే .. తమ్ముడే పరాయివాడైయ్యాడు – రేవంత్ రెడ్డి