BRS – Pocharam: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో సారీ గెలిచి హాట్రిక్ రికార్డు కొట్టాలని ఆశించిన బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ కావని, తామే అధికారంలోకి వస్తామని ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యే వరకూ బీఆర్ఎస్ నేతలు ఆశపడ్డారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోనే కాంగ్రెస్ ముందడుగు కొనసాగింది.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ రెండు సార్లకు మించి ఎన్నికల్లో విజయం సాధించలేదు. 1983, 85 లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత 1994లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో,99లో చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2004,2009 ఎన్నికల్లో రెండు సార్లు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2018 ఎన్నికల్లో రెండు సార్లు కేసిఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
కేసిఆర్ ఈ సెంటిమెంట్ ఆలోచించే పార్టీ పేరును టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్పు చేశారేమో కానీ మూడో సారి అధికారాన్ని కైవశం చేసుకోలేకపోయారు. బీఆర్ఎస్ పార్టీ విషయంలోనూ సెంటి మెంట్ కొనసాగింది. కానీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విషయంలో మాత్రం సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించి గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. గతంలో స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన వారు తదుపరి ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు లేవు.
తాజాగా పోచారం విజయం సాధించి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత స్పీకర్ గా పని చేసిన మధుసూధనా చారి, ఉమ్మడి ఏపీలో స్పీకర్ గా బాధ్యతలు నిర్వహిరించిన నాదెండ్ల మనోహర్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైయ్యారు. ఈ కారణంగా 2018 లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో పోచారంను కేసిఆర్ ఒప్పించి సభాపతిగా నియమించారు.
Telangana Election Results: ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు .. రెండు నియోజకవర్గాల్లోనూ ఈటల వెనుకంజ