KCR: పలువురు అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా ఓ చెట్టు వద్దకు క్యూకట్టారు. అక్కడ అందరూ ఫోటోలు దిగారు. దానికి విశేషం ఏమిటంటే తెలంగాణలో హరితహారం మొదటి విడతలో భాగంగా సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలోని దేవునిగూడెం సమీపంలో ఓ మొక్కను నాటారు. ఆ మొక్కను నాటి ఆరేళ్లు అవుతుండగా అది ఏపుగా పెరిగి నేడు పెద్ద చెట్టుగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఏడవ విడత హరితహారం కార్యక్రమం కొనసాగుతుండగా నేతలు అధికారులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా నాడు కేసిఆర్ నాటిన మొక్క వద్దకు పెద్ద సంఖ్యలో అధికారులు, అనధికారులు వెళ్లి చెట్టుతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నాటిన మొక్క కావడంతో అధికారులు ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకున్నారు. అటవీశాఖ అధికారులు ఆ మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Read More: Driving License: డ్రైవింగ్ లైసెన్సు పొందడం ఇక సులభతరం..!ఎలా అంటే..?
తాజాగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆర్ శోభ, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ తదితర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి పల్లే పకృతి వనాలను సందర్శించారు. వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటిన అనంతరం దేవునిగూడెంలో ముఖ్యమంత్రి కేసిఆర్ మొక్కను నాటి ఆరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ మొక్కను పరిశీలించారు. నాడు ముఖ్యమంత్రి స్వీయ పర్యవేక్షణలో నాటిన మొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లు మారి ఆహ్లాదకరంగా ఉండటంతో వాటి వద్ద అధికారులు ఫోటోలు దిగారు. ఇదండీ విశేషం.