దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పై ఏపిలో అయితే ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ ద్వారా అవగాహన కల్పించారు. గత రాష్ట్రపతి ఎన్నికల సమయంలో పలువురు సభ్యులు అవగాహన లేమితో ఓటు వేయడంతో పలు ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్ పై సభ్యులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సభ్యులకు అటువంటి అవగాహన కార్యక్రమం ఏమి చేపట్టలేదు. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నేతృత్వంలో అధికార టీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలకడంతో, యశ్వంత్ సిన్హాతో కలిసేందుకు టీపీసీసీ విముఖత చూపింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగంగానే ప్రకటన చేశారు. యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ సభ్యులు ఎవరూ కలవద్దని కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ రోజు పోలింగ్ సమయంలోనూ ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఓటింగ్ లో దిద్దుకోలేని తప్పు చేశారు. ప్రతిపక్షాలు బలపర్చిన యశ్వంత్ సిన్హాకు కాకుండా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఆమె ఓటు వేశారు. అయితే ఓటు వేసిన తరువాత తను చేసిన పొరబాటును గుర్తించిన సీతక్క..అక్కడి ఎన్నికల అధికారులను కల్సి పొరబాటున తమ పార్టీ బలపర్చిన అభ్యర్ధికి కాకుండా అధికార పార్టీ అభ్యర్ధికి ఓటు వేశాననీ, కావున తనకు మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నిబంధనల ప్రకారం మరో సారి అవకాశం ఇవ్వలేమని అధికారులు ఎమ్మెల్యే సీతక్కకు తెలిపారు. దీంతో ఆమె పోలింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చారు. అసెంబ్లీ నుండి బయటకు వచ్చిన తరువాత ఈ విషయాన్ని మీడియాకు సీతక్క స్వయంగా చెప్పారు.
విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మొదటి ప్రాధాన్యత ఓటును దౌపది ముర్ముకు సీతక్క వేశారు. సీతక్క మొదటి ప్రాధాన్యత ఓటును పొరపాటున వేశారా..? లేక కావాలనే ఎస్టీ మహిళ అనే సానుభూతితో ఓటేశారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై సీతక్క మీడియాతో మాట్లాడుతూ తను పెన్సిల్ అనుకుని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందు కోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపరు ఇవ్వాలని అడిగాననీ, కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదనీ, దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేసి వచ్చానని చెప్పారు. ఓటు వేయడంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదనీ, తన ఆత్మసాక్షిగా వేయాల్సిన వారికే ఓటు వేశాననీ, ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని సీతక్క పేర్కొన్నారు.
కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. వీల్ చైర్ లో వచ్చి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్