Telangana Election 2023: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారపర్వంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం అంటూ బీజేపీ జాతీయ నేతలను రప్పించి విజయసంకల్ప సభలు, రోడ్ షోలతో హెరెత్తిస్తోంది. బీసీ సీఎం నినాదాన్ని గట్టిగా తీసుకువెళుతూ కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను, అవినీతిని నేతలు వివరిస్తున్నారు. శనివారం నుండి హెమాహెమీలు రంగంలోకి దిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఇలా అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. శనివారం నుండి మూడు రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు.
శనివారం ప్రదాని మోడీ కామారెడ్డి, తుక్కుగూడ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ స్వార్ధ రాజకీయ పార్టీలని విమర్శించిన మోడీ.. తెలంగాణలో బీజేపీపై ప్రజలు నమ్మకం పెరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లేనని, కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్ఎస్ లోకి వెళ్తారన్నారు. ఇక మోడీ ఆదివారం దుబ్బాక, నిర్మల్, 27న మహబూబాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షో తో మోడీ తెలంగాణ ఎలక్షన్ టూర్ ముగియనుంది.
మోడీ కంటే ఒక రోజు ముందుగానే రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఆర్మూర్ లో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. తర్వాత రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్ పేట నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొన్నారు. శనివారం కొల్లాపూర్, మునుగోడు, పటాన్ చెరు సభల్లో పాల్గొని తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో పాల్గొన్నారు. కేసిఆర్ సర్కార్ వైఫల్యాలను వివరిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం (26వ తేదీ) ముక్తల్, ములుగు, భువనగిరి, కూకట్ పల్లి సభల్లో పాల్గొన్నారు.
యూపీ సీఎం యోగి శనివారం కాగజ్ నగర్, వేములవాడ సభల్లో పాల్గొని ప్రసంగించారు. సంపన్న రాష్ట్రం తెలంగాణ కేసిఆర్పాలనలో అవినీతి కుప్పగా మారిందని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అని అయన అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసిఆర్ పక్కన బెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ గెలవాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. మరో రెండు రోజులు యోగి తెలంగాణలో బీజేపీ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగిస్తారు.
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం బోధ్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా పెరిగిందని.. ఆ డబ్బంతా సీఎం కేసిఆర్ ఇంటికే చేరిందని విమర్శించారు రాహుల్ గాంధీ. కుటుంబ పాలన వల్ల తెలంగాణ నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన కనిపించడం లేదని అన్నారు. దొరల పాలన అంతం చేసి ప్రజల పాలన తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ ఆదివారం ఆందోల్, సంగారెడ్డి లో కార్నర్ మీటింగ్, కామారెడ్డి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ప్రియాంక గాంధీ శనివారం పాలేరు, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని అన్నారు ప్రియాంక గాంధీ. ప్రజల బాధలను బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమైయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బన్సీలాల్ పేట లో కాంగ్రెస్ సభలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలుచేశారు. పేదల ఖాతాల్లో ప్రధాని మోడీ రూ.15 లక్షలు వేస్తామన్నారు వేశారా అని ప్రశ్నించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ చెప్పారు .. చేశారా అంటూ మండిపడ్డారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు ..ఇచ్చారా అని ఫైర్ అయ్యారు. మోడీ, కేసిఆర్ ఇద్దరూ అబద్దాలే చెబుతారని విమర్శించారు.
కర్ణాటక డిప్యూటి సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లలో పాల్గొని ప్రసంగించారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అలానే తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేస్తామని తెలిపారు. తాండూర్, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ మంత్రులు కేటిఆర్, హరీష్ రావు విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Barrelakka Sirisha: బర్రెలక్క శిరీషకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ