Children’s Story: ఒక నగరంలో రామయ్య, రంగయ్య అనే వర్తకులిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. ఒక సారి రామయ్య వ్యాపార నిమిత్తం దూర దేశాలకు వెళ్తూ తన వద్దనున్న వంద టన్నుల వెండి (లోహము) వస్తువులను తన స్నేహితుడైన రంగయ్యకు ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచమని చెప్పి తాను ఊరు వెళ్ళిపోయాడు. కొంత కాలం తర్వాత రామయ్య సొంత ఊరుకి తిరిగి వచ్చి మిత్రుని ఇంటికి వెళ్లి .. మిత్రమా! నాకు విదేశీ వ్యాపారం కలిసి రాలేదు. అందుకని తిరిగి మన ఊరిలోనే మునుపటి లోహ వ్యాపారం చేయదలుచుకున్నాను. నేను విదేశాలకు వెళుతూ నీ వద్ద దాచి ఉంచిన లోహం (వెండి) నాకు ఇవ్వు అని అడిగాడు. అయితే రంగయ్యకు దురాలోచన వచ్చింది. స్నేహితుడిని మోసం చేయాలని తలిచాడు. అయ్యో.. మిత్రమా! ఈ ఏడు ఇంట్లో ఎలుకల బాధ ఎక్కువైంది. మా ఇంటిలోని వస్తువులతో పాటు నీ లోహమంతా కూడా ఎలుకలు తిని పొట్టన పెట్టుకొన్నాయి. ఈ మాట నీకు చెప్పటానికి నాకు నోరు రావడం లేదు. నేను ఎంతగనో చింతించాను, అది ఆ దేవునికే తెలుసు అంటూ రంగయ్య కంటతడి పెట్టాడు.
మిత్రుడు రంగయ్య తనను మోసం చేశాడని రామయ్య గ్రహించాడు. అతనితో ఇప్పుడు తగువు పెట్టుకునే కంటే కంటే సమయం చూచి దెబ్బకు దెబ్బ తీయుటం మంచిదని భావించాడు. నా దురదృష్టానికి నీవేమి చేయగలవు రంగయ్యా.. జరిగిన దానికి చింతించి లాభం లేదు. నా దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అంటూ రామయ్య పలికి ఇంటికి వెళ్ళిపోయాడు. తరువాత అతడు తన మిత్రుడైన రంగయ్యతో స్నేహం చేస్తూనే ఇంటికి వచ్చి పోతూ ఉన్నాడు. మిత్రుడికి బుద్ది చెప్పడానికి సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఒకనాడు రామయ్య మిత్రుని ఇంటికి వచ్చి అతని కుమారుని చూచి ఎత్తికొని ముద్దాడి బజారుకి తీసుకునిపోయి మిఠాయిలు కొనిస్తాను అన్నాడు. ఆ బాబుని తీసుకొని బజారుకి తీసుకెళ్ళాడు. పిల్లవానినొక స్నేహితుని ఇంటిలో దాచి తానొక్కడే రంగయ్య ఇంటికి వచ్చి, మిత్రమా! నీ పిల్లవానికి మిఠాయిలు కొనిపెట్టి తిరిగి వస్తుండగా, ఎక్కడనుండో ఒక పాడు గద్ద రివ్వున వచ్చి బాలుని తన్నుకొని పోయింది. నీకు చెప్పడానికి నోరు రావడం లేదు. అంటూ రామయ్య బాధపడుతూ రంగయ్యకు చెప్పాడు.
రంగయ్య కోపంతో వెంటనే రాజు గారి వద్దకు వెళ్లి మిత్రుడు రామయ్యపై ఫిర్యాదు చేశాడు. రాజు రామయ్యను పిలిపించి ఏమోయ్! పిల్ల వానిని గ్రద్ద తన్నుకొని పోయిందని చెప్పావంట, అది నమ్మతగ్గ విషయమేనా.. ? అంటూ రాజు రామయ్యను గద్దించాడు. ప్రభూ.. వంద టన్నుల (వెండి) లోహమును ఎలుకలు తినివేయగా లేనిది, బాలుని గ్రద్ద తన్నుకుపోవుటలో ఆశ్చర్యమేమున్నది, కావాలంటే నిజమో కాదో రంగయ్యనే అడిగి చుడండి అన్నాడు రామయ్య. రాజు జరిగిన కథ అంతా తెలుసుకున్నారు. రంగయ్య చేసిన మోసానికి రామయ్య వేసిన పన్నాగంగా గ్రహించారు. రంగయ్యను గట్టిగా మందలించి రామయ్యకు ఇవ్వవలసిన వంట టన్నుల వెండి తెప్పించి ఇవ్వాలని ఆదేశించారు. రాజు ఆజ్ఞతో రంగయ్య లోహమును తెప్పించి రామయ్యకు ఇచ్చేశాడు. తర్వాత రంగయ్య కొడుకును తెచ్చి రామయ్య అప్పగించాడు. మోసాన్ని మోసంతోనే జయించాలి అనేది ఇక్కడ నీతి.
Children’s Story: నక్క, కోడి పుంజు | Pillala Kathalu