Jamili Elections: కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికలు అంటోంది. చాలా కాలంగా జమిలి ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్నప్పటికీ అందుకు కేంద్రం చర్యలు చేపట్టలేదు. అయితే ఇప్పుడు జమిలి ఎన్నికలకు కేంద్రం వేగంగా అడుగుల వేస్తొంది. ఈ క్రమంలోనే తాజాగా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయ్యింది. ఎనిమిది మంది సభ్యులతో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ నెల 17వ తేదీ నుండి అయిదు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేందం నిర్ణయం తీసుకుంది. హైలెవల్ కమిటీ వీలైన త్వరలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
అయితే జమిలి ఎన్నికలు అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. రాజ్యాంగ సవరణ వంటి పెద్ద ప్రక్రియ ఉంటుంది. పార్లమెంట్ లో టూ థర్డ్ మెజార్టీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అది అసలు ఇప్పట్లో కుదిరే పని కాదు. అందువల్ల ఎలాంటి పేచీలు లేకుండా ఉండాలంటే డిసెంబర్ లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే మరో అయదు రాష్ట్రాల ఎన్నికలను మందుస్తుకు తీసుకువచ్చి జమిలి ఎలక్షన్స్ దారి చేయవచ్చనే ఆలోచనలో ఉందని అంటున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు పది రాష్ట్ట్రాల ఎన్నికలకు పూనుకునే అవకాశం ఉంటుంది. ఆలా చూసుకుంటే ఆ మరో అయిదు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత మహారాష్ట్ర, సిక్కిం వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఒక ఒడిశాలోని బూజూ జనతాదళ్ ప్రభుత్వం, ఏపీలోని వైసీపీ సర్కార్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కాకపోయినా కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా దాదాపు పది పన్నెండు రాష్ట్రాలను కలుపుకుని జమిలి ఎన్నికల పేరిట డిసెంబర్ లో ఎన్నికల నగరా మోగించాలి అనేది బీజేపీ బిగ్ ప్లాన్ అని వార్తలు వినబడుతున్నాయి.
జమిలి ఎన్నికలపై రాజకీయ పక్షాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా, జమిలి ఎన్నికలకు తాము సుముఖమే అని వైసీపీ మంత్రి గుడివాడ అమరనాథ్ పేర్కొన్నారు. లోక్ సభ ముందస్తు ఎన్నికలకు కేంద్రం వస్తే ఏపీలో కూడా ముందుగా ఎన్నికలకు వెళ్లేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రి అమరనాథ్ అంటూనే .. తుది నిర్ణయం తీసుకోవాల్సింది తమ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్ యేనని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఇండియా కూటమి బలపడకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే గత మెజార్టీ తగ్గినప్పటికీ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న భావనలో బీజేపీ పెద్దలు ఉన్నారని అందుకే ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారన్న మాట వినబడుతోంది. అయితే ప్రస్తుతం లండన్ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కేంద్రం ముందస్తు ఎన్నికలకు సిద్దమైతే.. ఏపీలోనూ నాలుగైదు నెలల పదవీకాలం వదులుకుని ముందస్తుకు సిద్దం కావడానికి అభ్యంతరం లేదని సన్నిహితులతో అన్నారని ప్రచారం జరుగుతోంది.
జగన్ మౌత్ పీస్ అయిన ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి జమిలిపై స్పందించారు. జమిలి ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డ సజ్జల. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధి విధానాలపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. దీని అమలుపై చాలా ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపులు చాలా కీలకం అన్నారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెండో సారి అధికారంలోకి వస్తామన్న ధీమాలో వైసీపీ పెద్దలు ఉన్నారు. ఎన్నికలకు సిద్దంగా ఉన్నందున వైసీపీ .. కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకునే నిర్ణయానికి జై కొట్టే అవకాశాలు ఉంటాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
జమిలి ఎలక్షన్ ప్రక్రియ పై స్పీడ్ పెంచిన కేంద్రం .. అధ్యయనానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు