Children’s Story: అనగనగా ఒక రాజ్యం లోని రాజు గారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాలు విక్రయించే మార్కెట్ లోకి వెళ్లారు. ఆ మార్కెట్ లో గుర్రాల వ్యాపారస్తులు అందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాల ప్రత్యేకతల గురించి రాజు గారికి చెప్పడం మొదలెట్టారు. ఓ వ్యాపారి తన వద్ద ఉన్న మీరు చెప్పినట్టు చేస్తుంది అని చెప్పగా, మరో వ్యాపారి నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది అని చెప్పాడు. ఉంకో వ్యాపారి అసలు నా గుర్రానికి భయమే తెలీదు అని తెలిపాడు. ఇలా ఒకరికొకరు తమ వద్ద ఉన్న గుర్రం గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఒక వ్యాపారస్తుడు మరీ అతికి పోయి, నా గుర్రం ఎగరగలదు అని రాజు గారితో అన్నాడు. దీనిపై వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొనుగోలు చేసి తనతో రాజ మహాల్ కు తీసుకుని వెళ్ళారు.
మరునాడు సేసాధిపతిని పిలిచి, ఈ గుర్రం ఎగురుతుంది అని రాజు గారు చెప్పారు. రాజు గారు చెప్పింది విని సేనాధిపతి ఆశ్చర్యపోయాడు. అయితే .. రాజు గారు చెప్పారు కదా అని గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కానీ గుర్రం ఎలా ఎగురుతుంది ? ఎగర లేదు. దీంతో రాజు గారు, అదేంటి, నిన్న మరి నాతో ఆ వ్యాపారస్తుడు అలా చెప్పాడు ఏమిటి. అతన్ని పిలవండి అని ఆదేశించాడు. రాజు గారి ఆజ్ఞతో సదరు వ్యాపారస్తుడిని రాజు గారి ముందు నిలపెట్టారు. రాజు గారు.. నిన్న నీ గుర్రం ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒక సారి ఎగిరించి చూపించు అని అజ్ఞాపించాడు. మహారాజా! గుర్రం ఎగురుతుంది, అంటే నా ఉద్దేశ్యం అంత వేగం గా పరిగేడుతుందని అని వ్యాపారస్తుడు చెప్పాడు. దీంతో రాజు గారికి విపరీతమైన కోపం వచ్చింది. ఇతని తల నరికేయండి అని భటులకు ఆదేశించారు. ఆ తర్వాత ముఖ్య మంత్రిని పిలిచారు. ముఖ్య మంత్రి! నాకు ఈ గుర్రం ఎగిరితే చూడాలని ఉంది! ఈ పని మీరే చేయాలి!” అన్నారు. ముఖ్య మంత్రి దంగ్ అయిపోయి, మహారాజా! గుర్రం ఎలా ఎగురుతుంది, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పానని ఒప్పుకున్నాడు కదా! అన్నారు.
దీంతో మహారాజు వెంటనే, ఇతని తల నరికేయండి!” అని అజ్ఞాపించాడు. ఇలా ఒక్కొక్కరినీ రాజు గారు పిలవడం, వాళ్ళను గుర్రం ఎగిరించి చూపించమనడం, వారు అదెలా సాధ్యం అని అడిగితే వారి తల తీసేయడం, కొన్ని రోజులు ఇలా గడిచాయి. మొత్తానికి ఒక రోజు ఒక సభికుడిని పిలిచిన రాజు గారు గుర్రాన్ని ఎగిరించమని ఆదేశించాడు. ఆ సభికుడు తల వంచి, అలాగే మహారాజా, నాకు ఒక సంవత్సరం గడువు ఇవ్వండి, నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. రాజు గారు సంతోషించి, ఒక సంవత్సరం గడువు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దీంతో సభికులు, రాజ్యంలో వున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎలా ఒప్పుకున్నావు ? అసలు గుర్రం ఎలా ఎగురుతుంది ? నీ దగ్గిర ఏమైనా ఉపాయముందా ? అని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఆ సభికుడు చిరునవ్వుతో తప్పించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వార్త ఊరంతా నిప్పులా పాకిపోయి ఆ సభికుడి ఇంట్లో ఉన్న అతని భార్యకి కూడా తెలిసింది. ఆందోళనగా భర్త ఇంటికి వచ్చే దాకా గుమ్మం వద్ద కాపు కాసింది అతని సతీమణి. ఇంటికి భర్త రాగానే విన్నది నిజమేనా అని అడిగింది.
ఆ సభికుడు నిజమే కానీ ఖంగారు పడవద్దు అని భార్యను ఇలా ఓదార్చాడు. మూర్ఖుల మనసులో ఒకటి పడితే అది సాధించాలన్న పట్టుదల బలంగా మొదలవుతుంది. వారితో వాదించడం కష్టం. మహా రాజు గారి మనసులో ఈ విషయం అలాగే బలంగా పడిపోయింది. వారిని కాదన్న వారి తలలు నరికించేస్తున్నారు. నన్ను అడిగిన వెంటనే నేను కూడా కుదరదు అంటే నా తల కూడా వెంటనే తెగేది. అందుకే ఒక సంవత్సరం గడువు అడిగితే రాజు గారు సరే అన్నారు. వెంటనే ఇప్పుడు ఉన్న ప్రమాదం తొలగిపోయింది కదా. ఆపైన చూద్దాం. ఏడాదిలో ఏమైనా కావచ్చు. రాజు గారు ఈ విషయం మరిచిపోవచ్చు, లేదా పట్టుదల తగ్గవచ్చు, భవిష్యత్తు ఎవరు చూసారు అని అన్నాడు. రాజులు మారెనో, గుర్రాలు ఎగిరెనో. మూర్ఖుడికి ఎదురు చెప్పడం కన్నా తప్పించుకుని తిరగడం మిన్న.. ఇతరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ.
Children’s Story: సింహం మరియు కుందేలు | Pillala Kathalu
కథలు.వరల్డ్ప్రెస్.కామ్ సౌజన్యంతో…