Children’s Story: ఒక ఊరిలో జమిందారు రైతుకి తనకు చెందిన నుయ్యి (బావి)ని అమ్మాడు. ఆ రైతు మరునాడు తాను కొనుగోలు చేసిన నుయ్యి నుండి నీళ్లు తీసుకోవడానికి వెళ్లాడు. అయితే ఆ నుయ్యి అమ్మిన జమిందారు అతి తెలివి ప్రదర్శించాడు. బావిలో నీళ్లు తీయడానికి వీలులేదని చెప్పాడు. ‘నేను నీకు నుయ్యి అమ్మాను కానీ, అందులోని నీళ్ళు అమ్మలేదు, అవి నావి. ఆ నీళ్ళు కావాలంటే తగిన రొక్కం (డబ్బులు) ఇచ్చి నీళ్ళు తోడుకో’ అన్నాడు రైతుతో జమిందారు. దీంతో రైతుకి జమిందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. జమిందారుకి, రైతుకి గొడవ జరిగింది.
వీరి పంచాయతీకి మధ్యవర్తిగా బీర్బల్ ని నిర్ణయించుకున్నారు. రైతు తన సమస్యను బీర్బల్ కు విన్నవించాడు. ఇరువురి సమస్య విన్నవించి న్యాయం చేయాలని బీర్బల్ ను కోరారు. బీర్బల్ కొంచం సేపు ఆలోచించి జమిందారు అతి తెలివికి అదే రీతిలో పరిష్కారం చెప్పారు. జమిందారును ఉద్దేశించి .. ‘సరే, నువ్వు నుయ్యి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదని ఒప్పుకుందాము. కానీ అలా అయితే నీకు నూతిలో నీళ్ళు పెట్టుకునే అర్హత లేదు. నీ నీళ్లన్నీ వెంటనే ఇంకెక్కడికైనా మార్చేసుకో. లేదా, రైతుకి నువ్వే నూతిలో నీళ్ళు పెట్టుకుంటున్నందుకు అద్దె ఇవ్వాలి.’ అంటూ బీర్బల్ తీర్మానం ఇచ్చాడు. బీర్బల్ తెలివి తేటల మూలంగా తన దగా విఫలం అయ్యిందని భావించిన జమీందారు.. గొడవ మానేసి నూతిలోని నీళ్ళు కూడా రైతువే అని ఒప్పుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు.