అమరావతి: వివాదాస్పదమైన సదావర్తి భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. శాసనసభలో చేసిన ప్రకటన మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ విజిలెన్స్ విచారణకు ఉత్తర్వులు జారీ చేశారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో సదావర్తి భూములకు బహిరంగ వేలం నిర్వహించగా, వేలం ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయని నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఆరోపించింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నది.
2016లో మార్చి 28న టిడిపి ప్రభుత్వం తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాలకు బహిరంగ వేలం నిర్వహించగా 22 కోట్ల 44లక్షల రూపాయల ధర పలికింది. భూముల వేలంలో అక్రమాలు జరిగాయనీ, ఏంతో విలువైన భూమి తక్కువ ధరల లభించినట్లు వైసిపి ఆరోపించింది. ఆ వేలాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు అదనంగా మరో అయిదు కోట్ల రూపాయలు చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఇతర వేలం పాట దారులు అభ్యంతరం చెప్పారు. దీంతో మళ్లీ వేలం పాట నిర్వహించగా కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన శ్రీసత్యనారాయణ బిల్డర్స్ తరపున శ్రీనివాసరెడ్డి, పద్మనాభయ్య 60.30 కోట్ల రూపాయలకు ఈ భూమిని దక్కించుకున్నారు. తాజాగా ఆ భూమిని తక్కువ ధరకే 22.44కోట్ల రూపాయలకే వేలంలో అప్పగించేందుకు ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో సదావర్తి భూముల వేలంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.