(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి : సంతోషంగా ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకోండి, గిఫ్ట్ తీసుకుంటే తప్పులేదు అని సాక్షాత్తు రాష్ట్ర రవాణా, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అవుతోంది. ఏపి జేఏసీ అమరావతి తృతీయ కౌన్సిల్ సమావేశంలో అయన ఉద్యోగులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం సర్వత్రా చర్చినీయాంశమవుతున్నది. మంత్రి వ్యాఖ్యలను టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా తప్పుపడుతున్నారు. అవినీతిని ప్రోత్సహించేలా మాట్లాడిన మంత్రి పేర్ని నానిని సి ఎం జగన్ మంత్రి వర్గం నుండి తొలగించాలని కొల్లు డిమాండ్ చేశారు.
మంత్రి పేర్ని వద్ద ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులపై జరుగుతున్న ఏసీబీ దాడుల గురించి ప్రస్తావించగా..పీక మీద కత్తి పెట్టి వసూలు చేస్తే అది దారి దోపిడీ అవుతుంది, పని చేస్తే ఎవరైనా సంతోషం గా ఇస్తే అది గిఫ్ట్ అవుతుంది, తీసుకోవచ్చు అని మంత్రి సెలవిచ్చారు.
మంత్రి పేర్ని వ్యాఖ్యలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా తప్పు పట్టారు. అవినీతిని ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి పేర్ని నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తే అవినీతిని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు హితబోధన చేయడం సిగ్గు చేటని అన్నారు. వైసీపీ పాలనలో గ్రామ స్థాయిలో వాలంటీర్ నుండి సీఎం వరకు అవినీతికి పాల్పడుతున్నారని కొల్లు విమర్శించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వాటాలు పంచుకుని ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మచిలీపట్నం సముద్ర తీరంలో బుసకను ఇసుక రూపంలో పెద్ద ఎత్తున దోచేస్తున్నారని కొల్లు ఆరోపించారు.