ప్రియాంకా గాంధీపై ఉమాభారతి విమర్శలు
న్యూఢిల్లీ: ఎన్నికల విమర్శలు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని కేంద్ర మంత్రి ఉమా భారతి ‘దొంగోడి భార్య’ అంటూ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలపై ప్రియాంక ప్రభావం ఏ మేరకు ఉంటుందని విలేకరులు ప్రశ్నించినపుడు.. ‘‘ఏమీ ఉండదు. భర్త దొంగతనం నేరాలలో నిందితుడు అయినప్పుడు అలాంటి మహిళ మీద ప్రజలకు ఏం అభిప్రాయం ఉంటుంది.. దొంగోడి భార్య గురించి జనం ఎలా అనుకుంటారో హిందూదేశంలో ఆమె గురించి కూడా అలాగే అనుకుంటారు’’ అని చెప్పారు.
ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా బీజేపీ నాయకులు పలువురు వీరిద్దరిపై అనేక విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవి మరింత ఎక్కువయ్యాయి. కానీ ఎక్కువగా రాహుల్ గాంధీ మీదే ఇవి ఉన్నాయి తప్ప ప్రియాంకను ఇలా ఎవరూ అనలేదు. రాబర్ట్ వాద్రాను ఫిబ్రవరిలో ఈడీ అధికారులు ప్రశ్నించినపుడు బీజేపీ నేతలు కాంగ్రెస్ మీద విమర్శలు మొదలుపెట్టారు. ‘‘రాబర్ట్ వాద్రా మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు వెళ్లడానికి కొద్ది ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వెలుపల అతడి పోస్టర్లు వెలిశాయి. అలాంటి వ్యక్తిని యువనాయకుడని పిలవడం ద్వారా కాంగ్రెస్ ఎంత దిగజారిందో తెలుస్తుంది’’ అని బీజేపీ సీనియర్ నేత సంబిత్ పాత్రా ట్వీట్ ఛేశారు.