జైపూర్: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా యుటర్న్ తీసుకుని మళ్లీ ప్రధాని మోదికి జై కొట్టారు. మంగళవారం జైపూర్లో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాధోడ్ నామినేషన్ కార్యక్రమంలో రాందేవ్ బాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాణాయామం కూడా చేయించారు. అనంతరం రామ్దేవ్ బాబా మాట్లాడుతూ జాతీయతావాదం, జాతీయ భద్రతకు మోది అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజలు అందరూ బిజెపికి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మోది లాంటి బలమైన నాయకుడు ప్రధానిగా ఉంటే ప్రపంచదేశాల్లో భారతదేశం రాబోయే 20-25సంవత్సరాల్లో సూపర్ పవర్గా నిలుస్తుందని రాందేవ్ అన్నారు. నేడు దేశం సుభిక్షంగా ఉందనీ, జవానుల భవిష్యత్తు సురక్షితంగా, మహిళలు గౌరవంతో, రైతులు సురక్షితంగా ఉన్నారని రాందేవ్ పేర్కొన్నారు.
2014 ఎన్నికల్లో మోదికి సంపూర్ణ మద్దతు ఇచ్చిన రాందేవ్ కొద్ది నెలల క్రితం ఒక ఇంగ్లీష్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేస్తారా అని ప్రశ్నించగా ‘నేను ఎందుకు చేస్తాను, రాజకీయాల నుండి స్వచ్చందంగా తప్పుకున్నాను, నేను ఏ పార్టీతోనూ లేను’ అని తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. తదుపరి డిసెంబర్ నెలలో కాబోయే ప్రధాని ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని రాందేవ్ వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లో రాందేవ్ భారతీయ జనతా పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఏడాది తరువాత బిజెపి పాలిత హర్యాన రాష్ట్రానికి బ్రాడ్ అంబాజిడర్గా (క్యాబినెట్ ర్యాంక్) నియమితులయ్యారు. ఆయనకు హర్యానా ప్రభుత్వం భద్రతా సిబ్బందితో పాటు ఎస్కార్ట్ వాహనం, ఒక కారు కేటాయించింది.