(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం)
ఢిల్లీ: దేశంలో పెద్ద చర్చనీయాంశంగా మారిన ఈవీఎంల రగడపై బీజేపీ స్పందించింది. ఈవీఎంల పనితీరుపై అవగాహన లేమి కారణంగానే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలు ఈవీఎంలు ఎలా పని చేస్తాయో తెలుసుకుంటే ఎన్నికలను అవి తమలాగా సమర్థంగా ఎదుర్కొని ఉండేవని బీజేపీ ఎత్తిపొడిచింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విపక్షాలు లేవనెత్తన సందేహాలను అనవసర భయాలుగా కొట్టిపారేశారు. సైకిల్కు ఓటేస్తే ఫ్యానుకు పడిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఈవీఎంలతో పోలింగ్ ఎలా జరుగుతుందో వివరించారు. సైకల్ గుర్తుకు ఓటు వేయదలచిన ఓటరు సైకిల్ గుర్తుకు ఎలా ఓటేస్తారని ఆయన ప్రశ్నించారు. కంప్యూటర్ చిప్ ప్రోగ్రామింగ్ ప్రకారం ఓటరు కమలం గుర్తుకు ఓటేస్తే అది సైకిల్కు పడుతుందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే యాబై శాతం ఓట్లు ఫ్యాన్కి పడతాయనీ, గ్లాసు గుర్తుకు ఓటేస్తే సగం కమలానికీ, ఇంకో సగం ఫ్యాన్కూ పడతాయనీ ఆయన వివరించారు. సైకిల్ గుర్తుకు ఓటేస్తే సగం ఫ్యాన్కూ సగం సైకిల్కూ పడతాయన్నారు. కమలానికి ఓట్లేస్తే 60 శాతం కమలానికీ, మిగిలినవి ఫ్యాన్కూ పడతాయనీ, ఏనుగు గుర్తుకు ఓటేస్తే హస్తం గుర్తుకు ఓట్లు పోతాయనీ ఆయన తెలిపారు. నోటా నొక్కితే అవి కచ్చితంగా హస్తం గుర్తుకు వెళతాయన్నారు. హస్తం గుర్తుకు ఓటేస్తే అవి కమలానివేనన్నారు.
ఇదంతా గమనించకుండా ఈవీఎంల కనీస పనితీరుపై అవగాహన లేకుండా విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఆయా పార్టీలు ఈవీఎంల పనితీరుపై తమ ఓటర్లకు అవగాహన కల్పించకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ ఓటర్లకు ఈవీఎంలలో ఏ మీట నొక్కాలో బాగా తెలుసునన్నారు. కనీసం ఈవీఎం మీటల గురించే తెలియనివారు ఇక ఏం పరిపాలన అందించగలరని ఆయన ప్రశ్నించారు. తన ఓటు ఏ పార్టీకి పడిందో తనకు తెలియదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు సైకిల్ గుర్తుపై మీట నొక్కి ఉంటే అది ఫ్యాన్ గుర్తుకే పడివుండే అవకాశం ఎక్కువన్నారు. నలబై ఏళ్ల రాజకీయానుభవం ఉందంటున్న చంద్రబాబుకు ఈ చిన్న విషయం అర్థం కాకపోవడం దురదృష్టకరమన్నారు. సైకిల్ గుర్తుకే గనక ఓటు వేయదలిస్తే చంద్రబాబు కమలం గుర్తు మీట నొక్కవలసి ఉండిందన్నారు.
ఈవీఎం చిప్పులు రష్యాలో తయారైనందువల్ల కోడింగ్ అలా మారిందన్నారు. రష్యా ప్రభుత్వం ప్రధాని మోదీ తెలివిని గుర్తించి ఇటీవలే ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తల్ అవార్డును ప్రకటించిందని ఆయన ఈ సందర్భంగా అసందర్భంగా గుర్తు చేశారు.
50 శాతం ఈవీఎం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈవీఎంలలో ప్రోగ్రామింగ్ను బట్టి వీవీప్యాట్ స్లిప్పులుంటా యన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే మాత్రం వాళ్లు గెలుస్తారా అని ఆయన ప్రశ్నించారు. అసలు ఈసీని రద్దు చేసేయాలన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను మాత్రం జీవీఎల్ సమర్థించారు. ఆయన సూచనను బీజేపీ స్వాగతిస్తోందన్నారు. చంద్రబాబు సూచనల్లో ఇదొక్కటే కాస్త తెలివైనదని ఆయన వ్యాఖ్యానించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలను ఆయన గట్టిగా తోసిపుచ్చారు. చిప్ కోడింగ్ను బట్టి ఓటింగ్ జరుగుతుందనీ, ఆ విషయం బీజేపీ అర్థం చేసుకోగలిగిందనీ, అదేమిటో విపక్షాలకు ఇప్పటికీ అంతుపట్టటం లేదనీ ఆయన వివరించారు.
ఇదిలావుండగా ఈవీఎంలపై బీజేపీ వ్యాఖ్యలను కాంగ్రెస్, ఆప్, టీడీపీ, సీపీఎం, సీపీఐ తప్పుబట్టాయి. ఈవీఎంలలో ఏ మీట నొక్కితే ఏ గుర్తుకు ఓటు పడుతుందో ముందే ఓటర్లకు అవగాహన కల్పించడంలో ఈసీ విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. మీటలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టకుండా పోలింగ్ నిర్వహించడమేమిటని ఆయన ప్రశ్నించారు.
Note: వ్యంగ్యవార్త అన్నది Faking News రచనాపద్ధతిలో ఒక భాగం. ఇవి నిజం వార్తలు కావు. ఆయా వాదనల్లోని డొల్లతనాన్ని వ్యంగ్యపద్ధతిలో ఎత్తిచూపడం దీని ఉద్దేశ్యం. పాఠకులు గమనించగలరు.