విజయవాడ: ఫేస్బుక్ సహాయంతో 14 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరిన భవానీ కథలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. భవానీకి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. మైనర్ కావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడలో భవానీని పెంచిన తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని నగర పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని ఇటీవలే తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఈ నెల 8న ఆమెను కన్న తల్లిదండ్రులకు అప్పగించేందుకు పెంచిన తల్లిదండ్రులు అంగీకరించారు. తాను కన్న తల్లిదండ్రుల వద్దే ఉంటానని భవానీ తేల్చి చెప్పడంతో ఆమె నిర్ణయం మేరకు పోలీసుల సమక్షంలో కన్న తల్లిదండ్రులకు భవానీని అప్పగించారు. దీంతో 14 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు భవానీ చేరింది. తాను పదిరోజులు పెంచినవారి వద్ద.. పది రోజులు కన్నవారి వద్ద ఉంటానని భవానీ తెలిపింది. తనకు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదని ఇద్దరూ తనకు తల్లిదండ్రులేనని చెప్పింది.
శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లికి చెందిన మాధవరావు, వరలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం. వారు 2006 నవంబర్లో ముగ్గురు బిడ్డల్ని ఇంటివద్దే ఉంచి కూలి పనులకు వెళ్లారు. వారి కుమార్తె భవానీ తన అన్నయ్యలు సంతోష్, గోపీతో ఆడుకుంటూ తప్పిపోయింది. రోడ్డుపై బిక్కుబిక్కుమంటూ రోదిస్తున్న భవానీని జయరాణి (జయమ్మ) అనే మహిళ చేరదీసి ఆమె తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల వాకబు చేసింది. ఫలితం లేకపోవడంతో అప్పట్లోనే సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసి.. భవానీ సంబంధీకులు వచ్చేవరకు ఆమెను తానే సాకేందుకు ముందుకొచ్చింది. భవానీని పెంచి ఇంటర్మీడియెట్ వరకు చదివించింది. భవానీకి ప్రస్తుతం 17 ఏళ్లు. అయితే, తన ఇంట్లో పని చేసేందుకు వచ్చిన భవాని గతం గురించి తెలుసుకున్న వంశీ అనే వ్యక్తి.. భవాని చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం ఫేస్బుక్లో వెతికాడు. ఆమె వివరాలతోపాటు భవానీ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
డిసెంబర్ 7న ఆ ఫొటోను చూసిన భవానీ అన్న.. వంశీకి ఫోన్ చేశాడు. అనంతరం భవానీనిని కలుసుకున్నారు. అయితే, భవానీని తల్లిదండ్రుల వద్దకు పంపించేందుకు పెంచిన తల్లిదండ్రులు జయమ్మ-జీవరత్నం అభ్యంతరం తెలిపారు. వచ్చినవారు అసలైన తల్లిదండ్రులని నిర్ధారణ కావాలని.. అప్పుడే తనను వారి వద్దకు పంపుతామని జయమ్మ చెప్పారు. అందుకోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. భవానీ అభీష్టంతోనే తల్లిదండ్రుల వద్దకు పంపిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వివాదం పటమట పోలీస్ స్టేషన్కు చేరింది. దీంతో పోలీసులు ఓ వైపు కన్న తల్లిదండ్రులు, మరోవైపు పెంచిన తల్లిదండ్రుల సమక్షంలో వివాదాన్ని పోలీసులు పరిష్కరించారు. అయితే, జయమ్మ ఫిర్యాదు మేరకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించనున్నారు.