- అది అత్యంత అశాస్త్రీయం
- ఎంబీబీఎస్ నుంచి తీసేయండి
- మహారాష్ట్ర మెడికల్ కమిటీ సిఫార్సు
నాగపూర్: ఎంబీబీఎస్ కోర్సులోని ఫోరెన్సిక్స్ మెడిసిన్ సిలబస్ నుంచి ‘కన్యత్వ పరీక్ష’ను తీసేయాలని మహారాష్ట్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ఎంయూహెచ్ఎస్) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. నాసిక్ కేంద్రంగా ఉన్న ఎంయూహెచ్ఎస్ పారాక్లినికల్ నిపుణుల అకడమిక్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కన్యత్వ పరీక్షలకు శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని, అందువల్ల దాన్ని తీసేయాలని సేవాగ్రంలోని మహాత్మాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎంజీఐఎంఎస్)లోని ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఇంద్రజిత్ ఖండేకర్ ఈ సిఫార్సు చేశారు.
డాక్టర్ ఆర్ జే భర్మా నేతృత్వంలో ఎంయూహెచ్ఎస్ ఏప్రిల్ 9న ఒక సమావేశం నిర్వహించింది. ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ హేమంత్ గోడ్బోలే, డాక్టర్ సందీప్ కాడు సహా పలువురు బోర్డు సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని, నిర్ణయం తీసుకున్నారు. బోర్డు నిర్ణయాన్ని ఎంయూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ కేడీ చవాన్ కు డాక్టర్ ఖండేకర్ సవివర నివేదిక రూపంలో పంపారు. ఎంబీబీఎస్ కోర్సులోని ఫోరెన్సిక్ మెడిసిన్ సబ్జెక్టు నుంచి కన్యత్వ పరీక్షలను పూర్తిగా తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎంయూహెచ్ఎస్ ను డాక్టర్ ఖండేకర్ కోరారు. అది ఎంత అశాస్త్రీయమో తన నివేదికలో ఆయన తెలిపారు. అది మానవ హక్కులను ఉల్లంఘించి, లింగ వివక్షకు దారితీస్తుందన్నారు.
కొన్ని పుస్తకాలలో నిజమైన కన్య, అబద్ధపు కన్య అంటే ఏంటో కూడా రాశారని ఖండేకర్ చెప్పారు. కానీ, ఆ ప్రకటనలు లేదా సమాచారానికి శాస్త్రీయ ఆధారాలు మాత్రం ఏ పుస్తకంలోనూ లేవన్నారు. ఈ భావనను ఇంకా కొనసాగిస్తే అది డాక్టర్లు, సాధారణ ప్రజలు, సమాజంలో తప్పుడు అభిప్రాయానికి తావిస్తుందని ఆయన చెప్పారు. ఇంతటి అశాస్త్రీయమైన అంశాన్ని వెంటనే వైద్య పుస్తకాల నుంచి తొలగించాలని డాక్టర్ ఖండేకర్ డిమాండుచేశారు. కన్యత్వం అనేది వ్యక్తిగత అంశమని, అవతలి వ్యక్తి కన్యా.. కాదా అన్న విషయం తెలుసుకునే హక్కు ఏ ఒక్కరికీ లేదని చెప్పారు.