అమరావతి: ఓటర్ల జాబితాలో పేరుందో లేదో అందరూ ఒకసారి చూసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రజలకు సూచించారు.
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫిబ్రవరి 26 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 71 లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. వారిలో కోటి 84 లక్షల 42 వేల మంది పురుషులు, కోటి 87 లక్షల 34 వేల మహిళా ఓటర్లు ఉన్నారన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల విధుల కోసం 430 కంపెనీల భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ద్వివేది వివరించారు.
‘అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను 4 విభాగాలుగా విభజించాం. ఫ్లయింగ్ స్క్వాడ్ కోసం 671 బృందాలను ఏర్పాటు చేశాం.ఈ నెల15 వరకు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 9.27 లక్షల ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5.25లక్షల దరఖాస్తులను తిరస్కరించాం. ఇంకా లక్షకు పైగా ఫారం-7 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. పోలింగ్ బూత్ల వద్ద మౌలిక వసతులు కల్పిస్తాం. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ జీవో గురించి పరిశీలిస్తాం. రాష్ట్రంలో మొత్తం 45,920 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం 58,778 మంది పోలీసులను వినియోగించనున్నాం. రాష్ట్రంలో 8,812 సమస్యాత్మకమైన ప్రాంతాలుగా.. 3,186 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించాం’ అని ద్వివేది చెప్పారు.