కడప: దేశంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం చంద్రబాబుతో కలిసి కడపలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
జిల్లాలో ముస్లిం వర్గీయులు ఎక్కువగా ఉండటంతో ఫరూఖ్ అబ్దుల్లాను చంద్రబాబు ప్రచారానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫరూఖ్ అబ్దుల్లా పై ప్రశంసలు కురిపించారు.
ఫరూక్ అబ్దుల్లా తండ్రి అప్పట్లోనే జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రిగా పని చేశారనీ, ఫరూక్ అబ్దుల్లా సైతం నాలుగు పర్యాయాలు సీఎంగా వ్యవహరించారని, ఆయన తనయుడు ఒమర్ కూడా ముఖ్యమంత్రిగా చేశారని చంద్రబాబు వివరించారు.
ఫరూక్ అబ్దుల్లాకు మన రాష్ట్రం అంటే ఎంతో అభిమానమనీ, అప్పట్లో కాంగ్రెస్ మన రాష్ట్ర సర్కారును బర్తరఫ్ చేసినప్పుడు ఆయన మనకు ఎంతో మద్దతుగా నిలిచారనీ, అందుకే ఎన్టీఆర్ కు ఫరూఖ్ అంటే ఎంతో ఇష్టమని చంద్రబాబు తెలిపారు. దేశం బాగుండాలని కోరుకునేవాళ్లలో ఫరూఖ్ అగ్రగణ్యుడని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జగన్,మోది పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసిఆర్కు మద్దతిస్తే తప్పేంటి అని జగన్ అడుగుతున్నారని, కేసిఆర్కు మద్దతివ్వటం ముమ్మాటికీ తప్పేనని చంద్రబాబు అన్నారు. ఆస్తుల్లో మనకు రావాల్సిన వాటా ఇవ్వలేదు. పోలవరం కట్టొద్దని సుప్రీంకోర్టులో కేసిఆర్ కేసులేసారు. ఆంధ్రులను ఇష్టమొచ్చినట్లు తిట్టారు. అలాంటి కేసిఆర్కు ఎలా మద్దతిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రధాని మోదీకి దగ్గర స్నేహితుడు జగన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసుల మాఫీ కోసమే మోది సంకలో జగన్ కూర్చున్నారని ఆయన అన్నారు.
ముస్లింల పట్ల మోది వివక్ష చూపుతున్నారనీ,దేశంలో ముస్లింలకు భద్రత లేకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలకు అండగా ఉన్నామని ఆయన గుర్తుచేశారు. హిందువులకో చట్టం,ముస్లింలకో చట్టమా? అని ప్రశ్నించారు.
గుజరాత్లో ముస్లింల ఊచకోత విషయంలో మోదీని తప్పించాలని మొదట తామే డిమాండ్ చేశామని చంద్రబాబు తెలిపారు. అందుకే ‘తానంటే’ మోదీకి కోపమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
పెన్షన్లను 10 రెట్లు పెంచిన ఘనత టిడిపిదేనని చంద్రబాబు అన్నారు. పెన్షన్లను రెండు వేల నుంచి మూడు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు పది వేల చొప్పున సాయం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. చంద్రన్న బీమాతో పేదలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అన్న క్యాంటీన్లతో నాణ్యమైన భోజనం పెడుతున్నామని చంద్రబాబు వివరించారు.
అనంతరం ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్కు 1500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఆనాడు జగన్ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు.
డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటారనీ, జగన్కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందనీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు స్పష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అద్బుతమైన కార్యక్రమాలు తీసుకువచ్చారనీ, అన్ని వర్గాలవారికి, మహిళల కోసం, యువత కోసం, వ్యవసాయదారుల కోసం అనేక కార్యక్రమాలు చేశారని కొనియాడారు. నదుల అనుసంధానం వంటి విధానాలు చాలా అద్భుతమని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా, ఏం తింటున్నా, మనం భారతీయులమని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశమంతా ఒక్కటేనని, కానీ ప్రాంతాల వారీగా, మతాలవారీగా, రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. అలాంటి వారిని తిప్పికొట్టాలని ఫరూక్ అబ్దుల్లా పిలుపునిచ్చారు.