(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మంచినీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై నగరానికి శుక్రవారం ఉదయం వాటర్ ట్రయిన్ బయలుదేరి వెళ్లింది. చెన్నై నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోలార్పేట నుంచి 25 లక్షల లీటర్ల నీటితో 50 టాంకర్ల రైలు బయలుదేరి వెళ్లింది. రోజూ కోటి లీటర్ల నీటిని రైళ్ల ద్వారా చెన్నైకి తరలించాలని చెన్నై మెట్రో వాటర్ సంస్థ తలపెట్టింది.
మధ్యాహ్నానికి చెన్నై శివార్ల లోని విల్లివాక్కంకు ఈ ట్రెయిన్ చేేరుకుంది. అక్కడ దానికి స్వాగతం పలికారు. రైలులో వచ్చిన నీటిని అక్కడ నుంచి కీల్పాక్ వాటర్ వర్క్స్ ట్యాంకుల్లో నింపుతారు. చెన్నై నగరానికి ఇక్కడ నుంచే నీరు వెళుతుంది.
చెన్నై నగరానికి నీరు తీసుకువెళ్లే రైలు ఒక ట్రిప్పుకు దక్షిణ రైల్వే ఏడున్నర లక్షల రూపాయలు మెట్రో వాటర్ సంస్థ నుంచి వసూలు చేస్తుంది. ఈ పధకం కోసం రాష్ట్రప్రభుత్వం 65 కోట్ల రూపాయలు కేటాయించింది. చెన్నై నగరం అవసరాలకు రోజుకు 830 మిలియన్ లీటర్ల నీరు కావాలి. అయితే కనీస స్థాయి అయిన 525 మిలియన్ లీటర్ల నీటిని కూడా మెట్రో వాటర్ సంస్థ సరఫరా చేయలేకపోతున్నది. పైపుల ద్వారా జరిగే నీటి సరఫరాను 40 శాతం తగ్గించారు. నగరంలోని చాలా ప్రాంతాలలో పైపుల ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
Photos Courtesy: ANI