- సీఎస్టీ వద్ద కుప్పకూలిన రైల్వే ఎఫ్ఓబీ
- ఆరుగురి మృతి.. 33 మందికి గాయాలు
- రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో దుర్ఘటన
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్రమోదీ
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఘోరం జరిగింది. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వేస్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 33 మంది గాయపడ్డారు. బ్రిడ్జి మరమ్మతుల్లో ఉన్నా, ఇంకా దాన్ని వాడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో రద్దీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అది కూలిపోయింది. బ్రిడ్జి మునిసిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ముంబై కార్పొరేషన్ నిర్వహణలో ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది. కానీ, శివసేన శాసనసభ్యుడు అనిల్ దేశాయ్ మాత్రం దాన్ని ఖండించారు. ఈ విషయమై ఇటు రైల్వేశాఖ, అటు కార్పొరేషన్ కలిపి దర్యాప్తు చేస్తాయని రాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే చెప్పారు. ప్రమాదంలో ఆరుగురు మరణించడంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముమ్మరంగా సహాయచర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడకు చేరుకుని సహాయ కార్యకలాపాలు చేపట్టింది. సీనియర్ పోలీసు అధికారులు కూడా అక్కడే ఉండి సాయపడ్డారు. శిథిలాల కింద 10-12 మంది వరకు చిక్కుకుని ఉంటారని తొలుత భావించినా, తర్వాత ఎవరూ లేరని ఖరారైంది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు. వారు జీటీ ఆసుపత్రిలో పనిచేస్తారు. క్షతగాత్రులలో 10 మందిని అదే ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. మరో పది మందిని సెయింట్ జార్జి ఆసుపత్రికి పంపారు.
పర్వాలేదు గానీ..
బ్రిడ్జి మరీ దారుణమైన పరిస్థితిలో లేదని.. దానికి చిన్నపాటి మరమ్మతులే జరుగుతున్నాయని మహారాష్ట్ర మంత్రి వినోద్ తావ్డే చెప్పారు. అయితే, పనులు పూర్తయ్యేవరకు దాన్ని ఎందుకు మూయలేదనే విషయమై దర్యాప్తు చేయించాల్సి ఉందన్నారు. 1984లో నిర్మించిన ఈ బ్రిడ్జి సీఎస్టీలోని ఒకటో నెంబరు ప్లాట్ ఫాం, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వద్ద బీటీ లేన్ లను కలుపుతుంది. ప్రమాదం కారణంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఆరు నెలల క్రితం సేఫ్టీ ఆడిట్ లో భాగంగా బ్రిడ్జికి చిన్నపాటి మరమ్మతులు చేశారు. గత జూన్ నెలలో అంధేరిలో ఒక బ్రిడ్జి కూలడంతో అన్నింటినీ పరిశీలించారు. మొత్తం 445 బ్రిడ్జిలను అప్పుడు పరిశీలించారు.
సీఎం, కాంగ్రెస్ సంతాపం
ముంబైలో టీఓఐ భవనం వద్ద ఎఫ్ఓబీ కూలిన ఘటనపై తీవ్ర ఆవేదనకు గురైనట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ట్వీట్ చేశారు. బీఎంసీ కమిషనర్, ముంబై పోలీసులతో దీనిపై మాట్లాడానని, సహాయ చర్యలు వేగవంతం చేయాల్సిందిగా ఆదేశించానని తెలిపారు. ఈ విషయంలో రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముంబై బ్రిడ్జి దుర్ఘటన విషయం తెలిసి తీవ్ర ఆవేదనకు గురైనట్లు కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరింది.
గతంలోనూ బ్రిడ్జిలు…
భారీ వర్షాల తర్వాత గత జూన్ నెలలో అంధేరి స్టేషన్ లోని 40 ఏళ్లనాటి బ్రిడ్జి కూలింది. 1971లో కట్టిన ఆ బ్రిడ్జి డిజైన్ లోపం వల్లే కూలిందని అప్పట్లో రైల్వే మంత్రి పియూష్ గోయల్ అన్నారు. దానికి 9 నెలల ముందు 2017లో ఎల్ఫిన్ స్టోన్ బ్రిడ్జి కూలి 23 మంది మరణించారు.