కడప, మార్చి 15: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.
వివేక హఠాన్మరణం కుటుంబ సభ్యులను వైసిపి శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
1950 ఆగస్టు ఎనిమిదిన జన్మించిన వివేకానంద రెడ్డి రెండుసార్లు కడప పార్లమెంట్ సభ్యుడిగా, రెండు పర్యాయాలు పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
శుక్రవారం ఉదయం గుండెపోటు కారణంగా పులివెందులలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
వివేకానంద రెడ్డి వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నాన్న. వివేక మృతితో పులివెందుల శోక సంద్రం అయింది.
వివేక మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.