(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అతను ఒక నర్సు. తన సంరక్షణలో ఉన్న రోగులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడు. అలాంటిది తనకు చంపుదాం అనిపించినప్పుడల్లా ఎవరో ఒకరిని చంపుతూ పోయాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి జర్మనీలో ఇంత పెద్ద సీరియల్ కిల్లర్ లేడు. 85 మంది రోగులను హత్య చేసినందుకు గాను కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి హంతకుడి మారణకాండ ఏ మాత్రం అర్ధం కావడంలేదని వ్యాఖ్యానించినట్లు ఎఎఫ్పి వార్తాసంస్థ తెలిపింది.
42 ఏళ్ల నీల్స్ హెగెల్ 2000 సంవత్సరం నుంచి 2005 మధ్య ఉత్తర జర్మనీలోని ఓల్డెన్బర్గ్లో అనేక మంది రోగులను ప్రాణాంతక ఇంజెక్షన్లు ఇచ్చి చంపాడు. హెగెల్ రోగికి కార్డియాక్ అరెస్ట్కు దారితీసే ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ప్రాణామాయస్థితిలో ఉన్న ఆ రోగికి గుండె తిరిగి కొట్టుకోవడానికి ఛాతీని మర్దనా చేసేవాడు. అయితే రోగి బతకడం అరుదుగా జరిగేది. 2005లో ఒక రోగికి ఇలాగే ఇంజక్షన్ ఇస్తుండగా చూసి అరెస్టు చేశారు. 2008లో అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అతని చేతిలో చనిపోయిన రోగుల బంధువులు వత్తిడి చేయడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. హెగెల్ చేతిలో మరింతమంది చనిపోయినట్లు తేలడంతో 2015లో అతనికి యావజ్జీవ కారాగారవాసం శిక్ష విధించారు.
గత సంవత్సరం అక్టోబర్లో హెగెల్పై మూడవ విచారణ మొదలయ్యే నాటికి అతను 10 సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసాడు. 85 మందిని చంపినందుకు మూడవ శిక్ష విధించారు. అయితే హెగెల్ చేతిలో మరణించిన వారి సంఖ్య 200 వరకూ ఉండవచ్చని అంచనా. అన్ని మరణాలకూ సంబంధించి స్పష్టత ఇవ్వలేకపోతున్నందుకు మన్నించాలని న్యాయమూర్తి మృతుల కుటుంబ సభ్యులను కోరారు. విచారణ చివరి రోజున హంతకుడు తన భయంకరమైన నేరాలకు తనను మన్నించాల్సిందిగా మృతుల బంధువులను కోరాడు. హెగెల్ ఎందుకు ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడో తెలియదు.