న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లాలని అర్జీ పెట్టుకున్న తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్కు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిశారు. ముందుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని కలిసిన తరువాత ఆమె అమిత్షా ఛాంబర్కు వెళ్లి కలిశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి పని చేశారు. వైఎస్ మరణానంతరం ఓబులాపురం గనుల కేటాయింపులో శ్రీలక్ష్మిపై పలు అభియోగాలు రావడంతో సిబిఐ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఆమె కొద్ది నెలలు జైలు జీవితం గడిపారు. జైలులో అనారోగ్యానికి గురయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన తరువాత ఆ కేసులో శ్రీలక్ష్మి నిర్దోషిగా బయటపడ్డారు.
రాష్ట్ర విభజన అనంతరం శ్రీలక్ష్మిని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ క్యాడర్కు కేటాయించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసిపి అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు వచ్చేందుకు శ్రీలక్ష్మి ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కూడా అమెకు రాష్ట్రంలో కీలక పోస్టు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. జగన్ సానుకూలంగా స్పందించడంతో ఆంధ్రప్రదేశ్కు డెప్యుటేషన్పై వెళ్లేందుకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శ్రీలక్ష్మిని రిలీవ్ చేసింది. అయితే ఆమె డెప్యుటేషన్కు సంబంధించిన అభ్యర్థనపై కేంద్రం ఇప్పటి వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ విషయంపై మాట్లాడేందుకు మంగళవారం శ్రీలక్ష్మి పార్లమెంట్కు వచ్చినట్లు భావిస్తున్నారు. అమిత్షాను కలిసి ఆమె అభ్యర్థనను తెలియజేసిన తరువాత పిఎంఒ సీనియర్ అధికారులను కూడా శ్రీలక్ష్మి కలిశారు.
అతి చిన్న వయస్సులోనే ఐఎఎస్కు ఎంపికైన అధికారులలో శ్రీలక్ష్మి కూడా ఒకరు. ఆమె సర్వీస్లో ఓబులాపురం మైనింగ్ కేసు నమోదు కాకపోయిఉంటే ఇప్పటికే కేంద్ర కార్యదర్శి హోదా వరకూ వెళ్లేవారు.