(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కశ్మీర్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరలేదని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం రాజ్యసభలో పేర్కొన్నారు. మోదీ తన మధ్యవర్తిత్వం కోసం విజ్ఞప్తి చేశారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పక్కన కూర్చుని ఉండగా సోమవారం ట్రంప్ వాషింగ్టన్లో చేసిన ప్రకటన ఈ రోజు పార్లమెంట్ ఉభయ సభలను కుదిపివేసింది. రెండు సభలూ పలుమార్లు వాయిదా పడ్డాయి. విదేశాంగ మంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. ప్రధానే తనకు విజ్ఞప్తి చేసినట్లు ట్రంప్ స్వయంగా చెప్పారు కాబట్టి ఆయన ఉభయ సభల్లో వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ అన్న మాటలు భారతదేశంలోని రాజకీయవర్గాలను నిర్ఘాంతపరిచాయి. ఇండియా మొదటి నుంచీ కశ్మీర్ సమస్యలో మధ్యవర్తుల జోక్యం నిరాకరిస్తున్నది. ఈ సమస్య ఇండియా పాకిస్థాన్ మధ్య వివాదమనీ, తామే పరిష్కరించుకుంటామనీ ఇండియా అంటున్నది. కశ్మీర్ వివాదంలోకి ఇతరులను దించేందుకు పాక్ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే ఇండియా పడనివ్వలేదు.
సోమవారం వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో కలిసి కూర్చుని ట్రంప్ కశ్మీర్ సమస్య గురించి మాట్లాడారు. “రెండు వారాల క్రితం ప్రధాని మోదిని కలిశాను. మేము దీని గురించి మాట్లాడాం. ఆయన మీరు మధ్యవర్తిగా ఉంటారా అన్నారు. ఎక్కడ అన్నాను నేను. ఆయన కశ్మీర్లో అన్నారు. ఎందుకంటే ఇది చాలాకాలంగా నడుస్తోంది. ఇంత కాలంగా నడవడమా అని నాకు ఆశ్చర్యం వేసింది” అన్నారు ట్రంప్. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ “70 సంవత్సరాలుగా” అన్నారు.
ట్రంప్ తన మాటలు కొనసాగించారు: “ఇది పరిష్కారం కావాలనుకుంటున్నాను నేను. నేను చేయగలిగితే..సంతోషంగా మధ్యవర్తిగా ఉంటాను. రెండు స్మార్ట్ దేశాలు,. స్మార్ట్ నాయకత్వం ఉన్న దేశాలు ఈ సమస్యను పరిష్కరించుకోలేవు అంటే నమ్మశక్యం కాదు. కానీ నన్ను మధ్యవర్తిత్వం చేయమంటే నేను చేయడానికి సిద్ధం”.
ట్రంప్ మాటల వల్ల కలిగిన నష్టాన్ని సరిచేసేందుకు అమెరికా విదేశాంగ శాఖ ప్రయత్నించింది. కశ్మీర్ సమస్య ద్వైపాక్షికమైనదని ప్రకటించింది.
ట్రంప్ ఇంత స్పష్టంగా మోదీ పేరు పెట్టి చెప్పినపుడు దానిపై వివరణ ప్రధానమంత్రి స్వయంగా ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి.