అమరావతి: రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్లు ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉదృతిని పరిశీలించారు. నదీ పరివాహన ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై కలెక్టర్ ఇంతియాజ్ మంత్రులకు వివరించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తుతోంది. వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నాలుగున్నర లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది సముద్రంలో కలిసే హంసలదీవి వరకూ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ పరుగులు తీస్తోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12అడుగులుగా ఉంది. కృష్ణ పాయలు అన్నీ నీటి ప్రవాహంతో నిండటంతో లంక వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బ్యారేజీ దిగువ ప్రాంత లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది ఒడ్డునే గుంటూరు జిల్లా ఉండవల్లిలో కరకట్టపై నివాసముంటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసానికి ముంపు సమస్య ఉందని గుర్తించిన అధికారులు ఆ సమాచారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించకుండా ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు వేశారు. చంద్రబాబు కాన్వాయ్ను హ్యాపీ రిసార్ట్స్కు తరలించారు. ఇంట్లో కింద గదుల్లోని సామానులను మేడపైకి తరలించారు. బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో లంక గ్రామాల్లో పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు. బ్యారేజీకి దిగువన తోట్లవల్లూరు మండలంలోని పలు ప్రాంతాలు మునిగిపోయాయి. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి ఇబ్బంది లేదని నీటి పారుదల శాఖ అధికారులు తెలియజేస్తున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకోవడంతో 20 గేట్లు ఎత్తి 4,85,292 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 53.34 టిఎంసిలు కాగా ప్రస్తుతం 50.05 టిఎంసిలుగా ఉంది.
పులిచింతల ముంపు మండలాల్లోని మాచవరం, బెల్లంకొండ, అచ్చంపేట పరిధిలోని 22 గ్రామాలకు గానూ పది గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రవాహంతో గుంటూరు జిల్లా మాదిపాడు, కృష్ణాజిల్లా రామన్నపేట వద్ద బల్లకట్టు, నాటుపడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని నదీ తీర ప్రాంతాలలో సహాయక చర్యలను జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, వసంత కృష్ణప్రసాద్లు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు.
తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అమరావతి కరకట్టపై గల చిగురు ఆశ్రమం నుండి 80మంది విద్యార్థులను విజయవాడ డాన్బాస్కోకు సంబంధించిన పాఠశాలకు చేర్చారు. వరద మరింత పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనీ, రెస్క్యూ టీమ్లు సిద్ధంగా ఉన్నాయని కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
ప్రకాశం బ్యారేజీకి ఈ మాదిరిగా వరద ప్రవాహం 1998, 2000, 2009 సంత్సరాలలో వచ్చింది.