భోపాల్: మధ్యప్రదేశ్లో సెక్స్ రాకెట్ కుంభకోణం కుదిపేస్తున్నది. ఈ వ్యవహారంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు చిక్కుకోవడంతో దుమారం రేగుతోంది. ఈ సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు అభ్యంతకర రీతిలో ఉన్నప్పుడు చిత్రీకరించిన వెయ్యి హైక్వాలిటీ వీడియో క్లిప్పింగ్స్ పోలీసుల చేతికి చిక్కాయి. అలాగే, వీరితో చాటింగ్ చేసిన మెసేజ్లు, ఆడియో క్లిప్పులు, వీడియో క్లిప్పింగ్కు సంబంధించి ఫైల్స్ ను నిందితుల వద్ద లభించాయి. దీంతో ఈ వ్యవహారంలో ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని నేతలు, అధికారులు హడలెత్తిపోతున్నారు. హనీ ట్రాప్ కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీ అధ్యక్షతన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో 12 మంది బ్యూరోక్రాట్లు, 8 మంది రాజకీయ నాయకులు ఉన్నట్లు సిట్ వెల్లడించింది. ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులతోపాటు సీనియర్ అధికారులు ఉన్నట్లు సంజీవ్ షమీ తెలిపారు. 10 మందికి పైగా సీనియర్ అధికారులను విచారిస్తున్నామని షమీ వెల్లడించారు.
ఈ మొత్తం కుంభకోణానికి సూత్రదారి అయిన శ్వేతా జైన్తో సహా ఐదుగురు యువతలను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం శ్వేతా జైన్ ను సిట్ విచారిస్తుంది. ఈ హనీట్రాప్లోకి కాలేజీ విద్యార్థినులు చిక్కుకున్నారు. శ్వేతా జైన్ ఓ ఎన్జీవోను ప్రారంభించింది. ముందుగా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మధ్య తరగతి కుటుంబాలను ఎంచుకుంటుంది. ఆ ఇళ్లలో ఉన్న చదువుకునే యుక్త వయసు అమ్మాయిలకు ఉద్యోగం ఇప్పిస్తానని, చదువుకునేందుకు సాయం చేస్తామంటూ మాయమాటలు చెప్పి.. వారిని నెమ్మదిగా తన సెక్స్ రాకెట్ కోసం వాడుకుంటుంది. అలా కాలేజీకి వెళ్లే యువతులను రాజకీయ నాయకులకు, ఉన్నతాధికారులకు ఎర వేస్తుంది. ఆ అధికారులు, నాయకుల కోరిక మేరకు సదరు యువతులను వారి వెంట టూర్లకు, ఫైవ్స్టార్ హోటళ్లకు పంపేది. అనంతరం వారు శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియో తీసేది. ఆ తర్వాత ఈ వీడియోలను చూపించి సదరు అధికారులను, నాయకులను బ్లాక్మెయిల్ చేసి భారీ కాంట్రాక్టులు, ఎన్జీవోకు అధిక మొత్తంలో విరాళాల రూపంలో డబ్బు సంపాదించేది. ఈ అక్రమాలపై ఇండోర్ మున్సిపల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చాయి. సదరు అధికారికి రూ.3 కోట్ల ఇవ్వాలని శ్వేతా, ఆమె సహాయకులు ఆర్తి దయాల్ బ్లాక్మెయిల్ చేసింది. ఈ గ్యాంగ్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ ని కూడా బెదింరించి రెండు కోట్ల రూపాయాలు డిమాండ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.