(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే తీవ్ర అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. ఒ పక్క కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. మరోపక్క రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడే సూచనలు ఆయనకు తలనొప్పిగా మారాయి.
గడచిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మితపక్షంగా ఎన్నికల్లో విజయం సాధించిన శివసేనకు..ఫలితాల అనంతరం సిఎం సీటు విషయంలో బీజేపీతో పేచీ వచ్చింది. దీనితో దశాబ్దకాలంగా బిజెపితో ఉన్న స్నేహానికి శివసేన కటీఫ్ చెప్పి ఎన్ సి పితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మహా ముఖ్యమంత్రి గా ఉద్ధవ్ ఠాక్రే గత ఏడాది నవంబర్ 28 న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఆయన ఏ చట్ట సభ నుంచీ ప్రాతినిధ్యం వహించలేదు. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిగా ఎన్నికైనా, లేదా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఆరు నెలల లోపు ఏదో ఒక చట్ట సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. వాస్తవానికి మార్చి 26 న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. మే 28 లోపు సీఎం ఉద్ధవ్ను గవర్నర్ నామినేట్ చేయకపోతే మాత్రం ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా ఎన్సీపీ నేత, మంత్రి అజిత్ పవార్ రంగంలోకి దిగి… గవర్నర్ కోటా నుంచి ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం గవర్నర్ కోటా నుంచి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆర్టికల్ 171 ప్రకారం సాహిత్యం, కళలు, సామాజిక కార్యకర్త, వివిధ కళల్లో నిష్ణాతులైన వారిని గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసే పూర్తి అధికారం ఉంది. అంతే కాకుండా గవర్నర్ ఏ వ్యక్తినైనా ఎమ్మెల్సీగా నామినేట్ చేసే విచక్షణాధికారం ఉంది.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని మంత్రి అజిత్ పవార్ సూచించిన దానిపై గవర్నర్ కోషియారీ ఇంత వరకు స్పందించ లేదు. దీనితో గవర్నర్పై శివసేన సీనియర్ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్భవన్ కుట్రలకు కేంద్రం కాకూడదు, చరిత్ర అలాంటి వారిని క్షమించదు. గవర్నర్ కోషియారీకి బీజేపీతో అనుబంధం ఉందన్నది బహిరంగ రహస్యమే. సీఎం ఉద్ధవ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుండా అడ్డుపడుతోంది ఎవరో?’ అంటూ శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్రంగా మండిపడ్డారు. రౌత్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ ఈ సంక్షోభంలో గవర్నర్పై ఒత్తిడి తేవడం సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రిని ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయినా ఇంకా సమయం ఉంది, సీఎం వేచి చూడాలని అయన అన్నారు. ఒక వేళ గవర్నర్ ఉద్దవ్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకుంటే మే 28 న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి నూతనంగా ఆయన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టాల్సి ఉంటుంది. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.