పాకిస్థాన్ కు భారతదేశం హెచ్చరికతాము 3 రెట్లు వేస్తామన్న పాకిస్థాన్
అమెరికా జోక్యంతో చల్లారిన ఉద్రిక్తత
న్యూఢిల్లీ: గత నెలలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్రస్థాయిలో చెలరేగిన ఉద్రిక్తతలు.. అమెరికా జోక్యంతోనే చల్లారాయి. ఒకవేళ ఆ సమయంలో అమెరికా జోక్యం చేసుకోకపోతే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించేది. ఈ విషయమై రాయిటర్స్ వార్తాసంస్థను ఉటంకిస్తూ ‘ఎన్డీటీవీ’ ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ స్వయంగా కలగజేసుకుని ఇరు దేశాలకు నచ్చజెప్పినట్లు ఆ ఘటనతో సంబంధమున్న వర్గాలు చెప్పాయని రాయిటర్స్ తెలిపింది.
క్షిపణి దాడి చేస్తాం
ఓ దశలో పాకిస్థాన్ మీద కనీసం ఆరు క్షిపణులు వేస్తామని భారత్ హెచ్చరించింది. దానికి పాకిస్థాన్ తాము మూడు రెట్లు ఎక్కువగా వేస్తామని బదులిచ్చింది. ఇరు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు చూస్తే.. ఏ నిమిషంలోనైనా యుద్ధం వస్తుందేమోనని ఆందోళనలు చెలరేగాయి. అయితే, ఇవన్నీ హెచ్చరికలతోనే ఆగాయి తప్ప అంతకంటే ముందుకు పోలేదు. అలాగే క్షిపణులు కూడా సంప్రదాయ ఆయుధాల్లాగే కనిపించాయి తప్ప రసాయనిక లేదా అణ్వస్త్రాలు కాదని చెప్పారు. 2008 తర్వాత దక్షిణాసియాలో ఇంత ఉద్రికత చెలరేగడం ఇదే తొలిసారని రాయిటర్స్ తెలిపింది.
తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు
పుల్వామా ఉగ్రవాద దాడికి బదులుగా జమ్ము కశ్మీర్ సమీపంలోని బాలాకోట్ వద్ద ఫిబ్రవరి 27న భారత యుద్ధవిమానాలు దాడిచేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. అందుకు ప్రతిగా పాక్ యుద్ధవిమానాలు భారత భూభాగం వైపు వచ్చాయి. భారత విమానం ఒకదాన్ని పాకిస్థాన్ కూల్చేసి పైలట్ అభినందన్ వర్ధమాన్ ను పట్టుకుంది. ఆ సమయంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్థాన్ ఐఎస్ఐ అధినేత ఆసిమ్ మునీర్ తో స్వయంగా మాట్లాడారు. పైలట్ ను పట్టుకున్నా తాము మాత్రం ఉగ్రవాద నిరోధం విషయంలో వెనుదిరిగేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాతే పాకిస్థాన్ భూభాగంలోకి కనీసం ఆరు క్షిపణులు ప్రయోగిస్తామని భారత్ హెచ్చరించింది. ఆ హెచ్చరిక ఎవరు చేశారో మాత్రం స్పష్టంగా తెలియలేదు. అదే జరిగితే తాము మూడు రెట్లు అదనంగా క్షిపణులు ప్రయోగిస్తామని పాక్ బదులిచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయమై దోవల్, మునీర్ కార్యాలయాలు రెండూ వ్యాఖ్యానించేందుకు నిరాకరించాయి.
ట్రంప్ – కిమ్ చర్చలతో వెలుగులోకి
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అణ్వస్త్ర నిరోధంపై ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నిస్తున్నపుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 27 రాత్రి, 28 తెల్లవారుజామునే అమెరికా భద్రతా సలహాదారు బోల్టన్ ఫోన్లో మాట్లాడారు. అప్పటికి ట్రంప్-కిమ్ చర్చలు జరిగి రెండు రోజులవుతోంది. తర్వాత అమెరికా మంత్రి పాంపియో దౌత్యపరమైన చర్చలు ప్రారంభించారు. ఇరు దేశాలతో మాట్లాడి ఉద్రిక్తతలను చల్లార్చారని విదేశాంగ శాఖ ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో చెప్పారు. పాంపియో స్వయంగా దోవల్ తోను, సుష్మా స్వరాజ్ తోను, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషితోను మాట్లాడారు. ఇంత తీవ్రస్థాయిలో అమెరికా జోక్యం చేసుకుని, ప్రయత్నించడం వల్లే భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత చల్లారింది.
మాట్లాడుతూనే ఉన్నా..
సంక్షోభ సమయం కొనసాగినంత కాలం తాను భారత నౌకాదళాధిపతి సునీల్ లాంబాతో మాట్లాడుతూనే ఉన్నానని అమెరికా ఇండో పసిఫిక్ కమాండ్ అడ్మిరల్ ఫిల్ డేవిడ్ సన్ తెలిపారు. ఈ విషయంలో చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా కల్పించుకున్నాయి. యూఏఈ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఇటు మోదీ, అటు ఇమ్రాన్ ఇద్దరితో చర్చించారు. ఇన్ని రకాల ప్రయత్నాలు జరిగిన తర్వాతే.. అభినందన్ వర్ధమాన్ ను విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ పార్లమెంటులో ప్రకటించారు. పాకిస్థాన్ మీద క్షిపణి దాడి జరిగే ప్రమాదం తప్పిందని, అయితే అలాంటిది జరిగితే సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నామని ఇమ్రాన్ అన్నారు. ఇరు దేశాల మధ్య 1947లో ఒకసారి, 1971లో ఒకసారి యుద్ధాలు జరిగాయి.