ధూలే (మహారాష్ట్ర) మార్చి 1 : ప్రచారం కోసం ప్రాకులాడకుండా ప్రధాని నరేంద్ర మోది ఐదు నిముషాలు కూడా ఉండలేరని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మహారాష్ట్రలోని ధూలేలో జరిగిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
‘పుల్వామా ఉగ్ర దాడి తర్వాత దేశమంతా ఐక్యమైందని మోది మీడియాకి చెప్తున్నారు. కానీ వెంటనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెస్ ను విమర్శించడానికి జాతీయ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా మోది వినియోగించుకున్నారు అని రాహుల్ అన్నారు. సోమవారం స్మారకాన్ని ప్రారంభించిన మోది ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేశారు.
‘ పుల్వామా దాడిని రాజకీయంగా వాడుకోవద్దని నేను అన్ని పార్టీలను విజ్ఞప్తి చేశాను. ఎందుకంటే ఇలాంటి సమయంలో మనమంతా ఐక్యంగా ఉండాలని. కానీ బిజెపి మాత్రం ఎక్కడికి వెళ్లిన తమ ప్రచారాన్ని వదిలి పెట్టట్లేదు. అదే మాకు వాళ్ళకి తేడా’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ రోజు ఉదయం మోది ఒక ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తూ.. నన్ను ద్వేషించే పార్టీలు ఇప్పుడు దేశాన్ని దేశాన్ని ద్వేషించటం మొదలుపెట్టాయి అని ప్రతి పక్ష పార్టీలను ఉద్దేశించి అన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ మోదీపై విమర్శలు చేశారు.