విశాఖ, మార్చి 1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులో ప్రతిపక్షాలపై ఏ విమర్శలు చేశారో సాయంత్రం విశాఖ సభలోనూ అవే విమర్శలు ఎక్కుపెట్టారు.
పుల్వామా దాడికి ప్రతీకారంగా చేసిన మెరుపు దాడులతో ప్రజల్లో నెలకొన్న దేశభక్తిని, జాతీయత భావాన్ని బిజెపి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించారు.
ఇక్కడి కొందరు నేతలు ‘దారుణంగా మాట్లాడుతున్నారని,ఈ మాటలు భారత భారత సైన్యం మనో స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు.
దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నాటి జై జవాన్ జై కిసాన్ నినాదం ను అరువు తెచ్చుకున్నారు.
ప్రజా చైతన్య సభ పేరుతో బిజెపి విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో సభ నిర్వహించింది.
మొన్నటి గుంటూరు సభ తర్వాత నేటి విశాఖ సభలో కూడా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. జాతిని కించపరిచే నేతల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోడీ అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం గట్టిగా ఉంటేనే దేశంలో రైతులు, జవానులు బాగుంటారని ఆయన అన్నారు. 2014లో మీరు బలపరిచిన కారణంగా మేము స్థిరమైన ప్రభుత్వం అందించగలిగామని చెప్పారు. 2019 కూడా మీరు బలపరిస్తే మరింత స్థిరమైన ప్రభుత్వం అందిస్తామని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి తాను పాటు పడుతున్నానని ఆయన చెప్పుకున్నారు. దశాబ్దాల కల విశాఖ రైల్వే జోన్ ఇచ్చామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర బిజెపి నాయకులు పాల్గొన్నారు