పోలీస్ స్టేషన్ ముందు చెట్టుకింద భైటాయించిన ఎంపిడిఒ సరళ
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఇటీవలే సీనియర్ జర్నలిస్ట్ డోలేంద్రప్రసాద్ ఇంటి మీదకు వెళ్లి దాడి చేసిన కేసును మరువకముందే ఇప్పుడు ఏకంగా మండల స్థాయి ప్రభుత్వ అధికారిణి ఇంటి మీదకు వెళ్లి దౌర్జన్యం చేశారు. దీనితో జనంలో ఆయనకు మరో చింతమనేని అనే పేరు వచ్చింది. గతంలో టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ రౌడీగా వ్యవహరిస్తున్నాడంటూ వైసిపి నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. నేడు అటువంటి దౌర్జన్యాలకే అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్పడడంతో టిడిపికి ఒక ఆస్త్రం దొరికినట్లయింది. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించి మరీ ఎంపిడిఒ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఫిర్యాదును రిజిస్టర్ చేయించారు.
విషయంలోకి వస్తే.. శుక్రవారం రాత్రి కల్లూరిపల్లి ఎంఐజి కాలనీలోని తన ఇంటిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి దాడికి వచ్చారని ఎంపిడిఒ సరళ ఫిర్యాదు చేశారు. తాను ఎండిఒగా పని చేస్తున్న వెంకటాచలం మండలంలో వైసిపి నాయకులు బిరదవోలు శ్రీకాంత్రెడ్డి సమీప బంధువు కృష్ణారెడ్డికి సంబంధించిన స్థలాల్లో లేఅవుట్ వేశారనీ, అందులో తాగునీటి పైపులైన్లతో పాటు ఇతర సౌకర్యాలు సమకూర్చేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ శ్రీకాంత్ రెడ్డి ఈ నెల ఒకటవ తేదీన ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడించారనీ ఎండిఒ సరళ తెలిపారు. రెండవ తేదీ సాయంత్రానికి అనుమతులు ఇవ్వాలని కోటంరెడ్డి పేర్కొన్నారనీ, అయితే గ్రామ సచివాలయ ప్రారంభోత్సవాలు అదే రోజు ఉండటం వల్ల అనుమతులు మంజూరు చేయడం కుదరలేదని సరళ చెప్పారు. తనకు ఎమ్మెల్యే ఫోన్ చేసి తాను చెప్పిన పని ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తూ దుర్భాషలాడారని ఎంపిడిఒ వివరించారు. సాయంత్రం తాను ఇంట్లో లేని సమయంలో కోటంరెడ్డి, ఆయన అనుచరులు వచ్చి ఇంట్లో ఉన్న తన తల్లిని దుర్భాషలాడటంతో పాటు నానా బీభత్సం సృష్టించారని చెప్పారు. తమ ఇంటి కరెంటు వైర్లు, కేబుల్ వైర్లు కట్ చేసి విద్యుత్, కేబుల్ సరఫరాలను నిలిపివేశారనీ, మంచినీటి పైపులైన్నూ ధ్వంసం చేసినట్లు తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డికి విషయం తెలియజేయగా ఆయన స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్దరింపజేశారని సరళ వివరించారు. ఎంపిడిఒ సరళ శుక్రవార రాత్రి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ, సిఐ ఇద్దరూ లేకపోవడంతో స్టేషన్ ముందు చెట్టుకింద భైటాయించారు. విషయం తెలుసుకున్న మండలంలోని గ్రామ కార్యదర్శులు అందరూ ఆమెకు సంఘీభావంగా అక్కడికి చేరుకున్నారు. ఎంపిడిఒ ఫిర్యాదుపై శనివారం ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
కోటంరెడ్డి చర్యలను టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్లు ఖండించారు. ‘ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనార్టీ జర్నిలిస్ట్ను ఫోన్లో చంపుతానని బెదిరించారు, జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేశారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇదే ఎమ్మెల్యే గతంలో ఒక ముస్లిం మైనారిటి జర్నలిస్ట్ ను ఫోన్ లో చంపుతానని బెదిరించారు. ఇదే ఎమ్మెల్యే గతంలో జమీన్ రైతు సంపాదకుడిపై దౌర్జన్యం చేసారు. ఒక మహిళా డాక్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అప్పుడే ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా?#JaganRowdyRajyam
— N Chandrababu Naidu (@ncbn) October 5, 2019