అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
తొలుత ఈ నెల 10వ తేదీన క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున క్యాబినెట్ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం తెలియజేశారు. ఈ నేపధ్యంలో సిఎంఒ నుండి 14వ తేదీ మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహణకు అజెండాతో కూడిన లేఖ సిఎస్కు పంపారు. దీనిపై క్యాబినెట్ సమావేశ నిర్వహణకు అనుమతి కోరుతూ సమావేశ ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేదికి పంపారు. దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన సిఇఒ గోపాలకృష్ణ ద్వివేది మరుసటి రోజు సెలవుపై వెళ్లారు. క్యాబినెట్ సమావేశానికి సంబంధించి ఆదివారం సాయంత్రం లోగా కేంద్ర ఎన్నికల సంఘం నుండి స్పష్టత రావాల్సి ఉండగా సోమవారం ఉదయం వరకూ ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. దీంతో సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సోమవారం ఉదయం సిఎస్ ఎల్వి సుబ్రమణ్యం భేటీ అయి చర్చించనన్నట్లు సమాచారం.
క్యాబినెట్ సమావేశం విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం నుండి అనుమతి రాకపోవడంతో అసలేమి జరుగుతోందన్న చర్చ సాగుతోంది.
నేటి సాయంత్రానికి కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రావచ్చని సిఎస్ కార్యాలయ వర్గాలు తెలియజేస్తున్నాయి.