హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ సమేతంగా వారం రోజుల పాటు మూడు రాష్ట్రాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. వీరు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
పుణ్యం పురుషార్ధం అన్నట్లు దక్షిణాదిన ముఖ్యమైన ఆలయాల సందర్శనతో పాటు తాను ప్రతిపాదించిన కూటమి ప్రయత్నాలకు నలుగురినీ కూడగట్టడం కెసిఆర్ పర్యటన ముఖ్యోద్దేశం. దేశంలో బిజేపియేతర, కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్కు శ్రీకారం చుట్టిన కెసిఆర్ తొలుత ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను కలిశారు. మొదటి పర్యటనలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తదితరులు కలిసినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీలు ఒక గొడుగు కిందకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి మాత్రం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు తెలియజేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఒక జాతీయ మీడియా ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ ఫలితాల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసే పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకో 16రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను కె చంద్రశేఖరరావు మళ్లీ ప్రారంభించారు. అందులో భాగంగా తొలుత కేరళలో అక్కడి సిఎం పినరయి విజయన్తో భేటీ కానున్నారు. కూటమిలోకి వామపక్షాలకు సైతం ఆహ్వానం పలుకుతున్నారు. ఆ తరువాత తమిళనాడు డిఎంకె నేత స్టాలిన్, తదుపరి కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాన మంత్రి దేవగౌడలతో సమావేశం కానున్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో ఏ జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ గద్దెపై ప్రాంతీయ పార్టీల హవా నెలకొల్పేందుకు కెసిఆర్ ఉత్సాహపడుతున్నారు. ఈ సన్నాహాలు ఫలించేందుకు పనిలో పనిగా తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెసిఆర్ మొదటి నుండి దైవిక బలంపై ఎక్కువగా నమ్మకం చూపిస్తుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా పెద్ద ఎత్తున రెండు మూడు పర్యాయాలు యజ్ఞ, యాగాదులు సైతం నిర్వహించిన సంగతి తెలిసిందే. భగవంతుడి ఆశీస్సులు ఉంటే ఏది చేసినా ఫలప్రదం అవుతుందని కెసిఆర్ విశ్వాసం.
పర్యటనలో భాగంగా నేటి మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వీరు సాయంత్రం ఆరుగంటలకు తిరువనంతపురం చేరుకుంటారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటీ అయి ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. అనంతరం తమిళనాడులోని రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు. ఆ రాష్ట్రంలో వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. తదుపరి కర్నాటక బయలుదేరి వెళతారు.