హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఆరోపించారు. వైఎస్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు టార్గెట్ చేశారని సునీతా రెడ్డి ప్రశ్నించారు. తమ కుటుంబంలో నష్టం జరగడమే కాకుండా అందుకు సంబంధించిన నింద కూడా తమపైనే మోపుతున్నారని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సునీతా రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు.
వైఎస్ అవినాశ్ రెడ్డి ఎంపీగా గెలవడం కోసం తన తండ్రి పనిచేశారనీ, జగన్ను సీఎం చేయడం కూడా ఆయన లక్ష్యమనీ సునీతా రెడ్డి తెలిపారు.
‘తమ కుటుంబానికి చెందిన అందర్నీ విచారణ జరుపుతున్నప్పుడు అనుమానాలున్న ఇతర వర్గాల వారిని ఎందుకు విచారించడం లేదు? హత్య కేసులో ఆదినారాయణరెడ్డిని సిట్ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? పరమేశ్వర్రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య సంబంధాలపై ఎందుకు ఆరా తీయడం లేదు?’ అని సునీతా రెడ్డి ప్రశ్నించారు.
తండ్రి హత్యపై ఉన్న తన అనుమానాలను సునీతా రెడ్డి విలేకరులకు వివరించారు. ‘నాన్న చనిపోయిన విషయం ఉదయం 6.40కి తెలిపారు. మాకు పరమేశ్వర్రెడ్డిపై అనుమానాలున్నాయి. స్థానిక సీఐకి అక్కడ ఏం జరిగిందో అంతా తెలుసు. పరమేశ్వర్ రెడ్డి 14వ తేదీ పొద్దున నాలుగున్నరకు ఆస్పత్రిలో చేరారు. అడ్మిట్ అయ్యేటప్పుడు వివేకానందరెడ్డి తనకు దగ్గరి బంధువు అని డ్యూటీలో ఉన్న వైద్యుడికి చెప్పాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆస్పత్రిలో ఉన్నంతసేపూ ఫోన్ వాడుతూనే ఉన్నారు. సాయంత్రానికి వైద్యుల ప్రమేయం లేకుండా తనంతట తానే ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లి దగ్గర్లోని హరిత హోటల్లో తెదేపాకు సంబంధించిన వారిని కలిశారు. రాత్రి 8 గంటలకు మళ్లీ అదే హాస్పిటల్కు వచ్చారు. మళ్లీ ఉదయం నాలుగున్నర ప్రాంతంలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి బయటకు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న వ్యక్తికి నిజంగా అనారోగ్య సమస్యలుంటే ఎవరైనా బయటకు వెళ్తారా? వివేకా చనిపోయాక మళ్లీ డిశ్చార్జ్ అయి వేరే ఆస్పత్రిలో చేరారు. అసలు హరిత హోటల్లో ఏం జరిగింది. రాత్రి వచ్చిన వ్యక్తి ఎవరు? వంటి అనుమానాలు మాకు ఉన్నాయి. నా తండ్రి గుండెపోటుతో మృతి చెందారని బయటికు ఎవరు ప్రచారం చేశారో తెలియదు. ఈ విషయాన్ని సిట్ తేల్చాలి. దర్యాప్తునకు సంబంధించిన కీలక విషయాలు చంద్రబాబుకు ఎలా తెలుస్తున్నాయి’ అని సునీతారెడ్డి ప్రశ్నించారు.
వైద్య వృత్తిలో ఉన్న తనకు రాజకీయాలతో సంబంధం లేదనీ, తండ్రి హత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుండడం చూసి మాట్లాడాల్సి వస్తోందనీ సునీతా రెడ్డి పేర్కొన్నారు.