న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన తదనంతరం జరిగిన పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనలకు సంబంధించి ఐదు కేసులను ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీ ట్రయిల్ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. రోజు వారి విచారణ జరిపి 45రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ట్రయిల్ కోర్టుకు సూచించింది. బాధితురాలి కారు ప్రమాద ఘటనపై ఏడు రోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని సిబిఐని ఆదేశించింది. బాధితురాలిని ఢిల్లీకి తరలింపుపై కుటుంబ సభ్యులే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బాధిత కుటుంబానికి 25లక్షల మధ్యంతర పరిహారం అందించాలనీ, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి చేయించారనే అభియోగంపై దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. బాధితురాలిని లారీతో ఢీకొట్టి చంపించాలని యత్నించారనే అభియోగాలపై యుపి బిజెపి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్, ఆయన బంధువులతో సహా తొమ్మిది మందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీంతో పాటు తనకు రక్షణ కల్పించాలని బాధితురాలి కుటుంబం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్కి రాసిన లేఖను సుమోటాగా తీసుకున్న న్యాయస్థానం వీటిపై నేడు విచారణ జరిపింది.