చావొచ్చి కుటుంబాలు ఏడుస్తున్నాయి…! రోగమొచ్చి రాష్ట్రం ఏడుస్తుంది..! వైరస్ గండమొచ్చి దేశం బాధిస్తుంది…! గ్రామాలూ, జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. వార్తలు ఇవ్వాలంటే పల్లెల్లో పరిస్థితులు, పంటలు దిగుబడుల వేళ రైతుల కష్టాలు, వైద్యుల దీన స్థితి, రోగుల అవస్థలు ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ పాపం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కళ్ళకు ఇవేం కనిపించట్లేదు. జగన్, వైసిపి ప్రభుత్వంని చిన్న విషయాల్లో ఇరికించే ప్రయత్నం చేయడం… చంద్రబాబు బూతు పాలిష్.., టిడిపికి భజన తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఈ వార్తల్లో కూడా నాణ్యత లోపించడం, రాధాకృష్ణ వంకర బుద్ధి కనిపించడం ఆ మీడియాపై మరింత వికారం పుట్టిస్తుంది.
సీఎం ని క్వరెంటైన్ చేసేయాలని…!
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. మంత్రి వర్గం. ఉప ముఖ్యమంత్రి… వీళ్ళందరూ ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి అవసరం. క్షణ క్షణం వీరి ఆదేశాలు, సమీక్షలు దిశానిర్దేశం అవసరం. ఇవన్నీ పట్టక… ఆర్కే కి ఒక చిన్న పనికిమాలిన పాయింటు దొరికింది. దాన్ని పట్టుకుని సాగదీసి, ఆ ఛానెల్ లో గంటల తరబడి వేసుకుని, ఆ పత్రికలో మొదటి పేజీలో వేసుకుని… పైత్యానందం పొందుతున్నాడు ఆయన. అదేమిటయ్యా అంటే “ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఢిల్లీ వెళ్లి వచ్చారట. నిజాముద్దీన్ లో ప్రార్థనలకు వెళ్లారట, తర్వాత రోజు జగన్ ని కలిసారుట, మంత్రులని కలిసారుట” ఇదీ సారాంశం. అంటే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు కరోనా సోకింది, క్వరెంటైన్ చేసేయండి అనేది ఆ వార్తల ఉద్దేశం. ఈ సారాంశం, ఉద్దేశం గ్రహించిన సగటు వీక్షకులు, ప్రేక్షకులు ఆర్కే వైపరీత్యానికి, పైత్యానందానికి ఆశ్చర్యపోతున్నారు. కనీసం స్పష్టత తీసుకోకుండా, ఒక సున్నిత అంశాన్ని పదేపదే చూపడం, పత్రికలో వేసుకుని హైలైట్ చేయడం అంటే రాష్ట్రాన్ని ఆందోళనలోకి నెట్టేయడమే.
గట్టిగా బదులిచ్చిన అంజాద్ బాషా…!
ఈ వార్తలపై ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గట్టిగా బదులిచ్చారు. తాను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ కోర్టు కేసు పని మీద ఢిల్లీ వెళ్లానని, మార్చి 5 నుండి తానూ కడపలోనే ఉన్నాననని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగలేదు. ఆ ఛానెల్ పై, పత్రికపై పరువు నష్టం దావా వేస్తానంటూ హెచ్చరించారు. ఇక ఈ విషయాన్నీ పక్కన పెడితే ఆర్కే మరో పైత్యాన్ని కూడా చూపించారు… రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ సరిగా పని చేయకుండానే, ఆశ , అంగన్ వాడి వర్కర్లు చేస్తున్న పనులను తాము చేసినట్టు బిల్డప్ కొడుతున్నారని రాసుకొచ్చారు. కావచ్చు… కానీ క్షేత్ర స్థాయిలో ఎవరి పనులు వాళ్లకి ఉన్నాయి. వీరి పనులు, బాధ్యతలు వీరికి ఉన్నాయి. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి తోచిన సర్వ్ చేస్తున్నారు, సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. ఆశలు, అంగన్ వాడీలు తమ రిపోర్ట్ ప్రకారం సర్వేలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో అందరినీ కలిసి పనిచేసేలా ప్రేరేపించే వార్తలు రాయకపోగా.., రెచ్చగొట్టేలా రాయడం ఈ పరిస్థితులకు తగిన జర్నలిజం కాదంటూ తిప్పికొడుతున్నారు. ఆపత్కాల వేళ వార్తలు, జర్నలిజం తో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్యవర్తిలా, వారధిలా పనిచేయాల్సింది పోయి.. ఉసిగొల్పే వార్తలు రాస్తుండడం రాధాకృష్ణకే చెల్లింది అంటూ సోషల్ మీడియాలో కూడా విమర్శలు వస్తున్నాయి.