(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగడం పార్టీకి ఇబ్బందికరమని వైసీపీ అధిష్టానం దగ్గుబాటితో చెప్పినట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. పురందేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని వెంకటేశ్వరరావును సీఎం జగన్ కోరినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వైసీపీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో పార్టీని వీడాలని దగ్గుబాటి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి తప్పుకున్న తర్వాత.. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలనే ఆలోచనలో దగ్గుబాటి ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో దగ్గుబాటి సమావేశం అయినట్లు సమాచారం. ఈ సమావేశంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన దగ్గుబాటి.. పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. వాస్తవానికి కుమారుడు దగ్గుబాటి హితేశ్ రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన పార్టీలో చేరారు. పర్చూరు నుంచి తొలుత హితేశ్నే పోటీ చేయించాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల చివరకు వెంకటేశ్వరరావే పోటీ చేసి ఓడిపోయారు. వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి బిజెపిలోనే కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల ముందు వరకూ వైసిపిలో క్రియాశీలకంగా ఉన్న నాయకుడు రావి రామనాధం.. దగ్గుబాటి పార్టీలో చేరికతో మనస్థాపానికి గురై తన అనుచరులతో కలిసి టిడిపిలో చేరిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో దగ్గుబాటి పరాజయం పాలయ్యారు. ఎన్నికల అనంతరం నుండి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యత దగ్గుబాటి నిర్వహిస్తుండగా పార్టీ వీడి వెళ్లిన రావి రామనాధం తిరిగి వైసిపిలో చేరడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపులు తయారయ్యాయి. వైసిపి ఇన్చార్జి బాధ్యతల నుండి దగ్గుబాటిని తప్పించి రావి రామనాధం లేదా గొట్టిపాటి భరత్లలో ఎవరో ఒకరికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారనని కూడా ప్రచారం జరుగుతోంది.
ఇటీవల దగ్గుబాటి అనుచరులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. పార్టీ ఇన్చార్జిగా దగ్గుబాటినే కొనసాగించాలని లేదంటే ఆయన కుమారుడు హితేశ్ కు బాధ్యతలు అప్పగించాలని కోరారు. ఈ సందర్భంగా దగ్గుబాటి దంపతులు చెరో పార్టీలో ఉండటం సరికాదని సిఎం జగన్ అభిప్రాయంగా ఉన్నట్లు మంత్రి బాలినేని కార్యకర్తలకు చెప్పినట్లు ప్రచారం జరిగింది. పురందేశ్వరి వైసిపిలోకి వస్తే సాదరంగా ఆహ్వానించడంతో పాటు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవించడానికి కూడా జగన్ సిద్ధంగా ఉన్నారని బాలినేని కార్యకర్తలతో పేర్కొన్నట్లు వార్తలు వినిపించాయి. వైసిపి నుండి వచ్చిన ఈ ప్రతిపాదనతో దగ్గుబాటి దంపతులు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా దగ్గుబాటి నియోజకవర్గానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇంచార్జ్ బాధ్యతల నుండి తప్పుకునే అవకాశాలు మెండుగా కనపిస్తున్నాయి. అయితే దగ్గుబాటి తప్పుకుంటే ఆ భాద్యతలను గొట్టిపాటి భరత్కు ఇవ్వాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. తమ నిర్ణయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే.. తన కుమారుడిని మాత్రం వైసీపీలోనే కొనసాగేలా సీఎం జగన్ తో దగ్గుబాటి మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం జగన్ షరతు నేపథ్యంలో కుమారుడి రాజకీయ భవితవ్యంపై మల్లగుల్లాలు పడిన దగ్గుబాటి.. చివరికి రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.