మోడల్గా కెరియర్ ప్రారంభించి.. తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన నటి పూజా హెగ్దే. తమిళ సినిమాలతో పాటు, హిందీ, తమిళం, మళయాలం సినిమాల్లో నటిస్తూ.. భారత సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకుంది పూజ. ఇటీవల స్టైల్ స్టార్ అల్లు అర్జున్ “అల వైకుంఠపురంలో” నటించి… బుట్టబొమ్మగా మంచి పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “రాధేశ్యామ్” సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, తెరపై తన అందాలతో కుర్రకారు మనసు దోచుకుంటున్న పూజాహెగ్దే.. తన అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. తన నటిస్తున్న సినిమాలు, ఇతర సంబంధిత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా చాలానే ఖాళీ సమయంలో దొరకడంతో తన కుటుంబ సభ్యులతో గడుపుతున్న ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.
అయితే, ఇటీవల తన కుటుంబ సభ్యులతో గడుపుతూ.. పూజా హెగ్దే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు, వీడియోలను గమనిస్తే.. భలే ఫన్నీతో పాటు ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి. వాటిలో తన కుటుంబ సభ్యులకు తానే స్వయంగా రెడీ చేసిన వంటకాలను ప్రేమగా వడ్డిస్తూ కనిపించింది. ఒకసారైతే ఫైవ్స్టార్ హోటల్లో మాదిరిగా.. గుర్తింపు పొందిన ప్రొఫెషనల్గా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేసి సర్వ్ చేసింది. ఇలాంటి వీడియోలు చాలానే షేర్ చేసింది ఈ బుట్టబొమ్మ.
ఇలా తన పర్సనల్ జీవిత విశేషాలతో పాటు, వెండితెర విశేషాలను పంచుకుంటున్న ఈ భామ చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, ఉన్నట్టుండి తనకు ముసల్దానిలా అవ్వాలని ఉందంటూ ఓ వీడియో షేర్ చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ఎందుకో తెలుసా? పూజా షేర్ చేసిన వీడియోలో తన నానమ్మ, అమ్మమ్మలు ఇద్దరు ఉన్నారు. అందులో వారు చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతున్నారు. వారిని అలా చూసినప్పుడు తనకు ఆ వయస్సులోకి వెళ్లాలని ఉందంటూ తెలిపింది. అందరికీ ఆ వయస్సు వచ్చినప్పుడు అలానే సంతోషంగా ఉండాలంటూ ఆకాంక్షించింది ఈ బుట్టబొమ్మ.