వాటర్ వార్ తో తెర పైకి కొత్త ఈక్వేషన్లు..
ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్..కేసీఆర్ మధ్య సంబంధాల్లో తేడా వచ్చిందా. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతోందా. కొద్ది రోజులుగా జరుగుతన్న పరిణామలతో ఎదురవుతున్న సందేహాలివి. కానీ, టీఆర్ఎస్ నుండి ఎవరూ జగన్ ను విమర్శించరు. అదే విధంగా వైసీపీ నుండి ఏ ఒక్కరూ కేసీఆర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయరు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇద్దరూ ఆత్మీయులుగా మారారు. జగన్ ప్రగతి భవన్ కు..కేసీఆర్ అమరావతికి రాకపోకలు సాగించటం..పలు అంశాల పైన ఏకాభిప్రాయానికి రావటం జరిగాయి. కానీ, ఎందుకో సడన్ గా ఈ భేటీలు …. మంతనాలు నిలచిపోయాయి.
ఇద్దరి మధ్య ఏదో ఉంది…
రాయలసీమ ఎత్తిపోతల పధకం పైన రెండు ప్రభుత్వాలు ఒకరి పైన మరొకరు కేసులు దాఖలు చేస్తున్నాయి. ఇదే సమయంలో కేటీఆర్ తమకు ఏపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో కేసీఆర్ సైతం ఇదే విషయం చెప్పారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జోక్యం చేసుకోవటానికి కేంద్ర అదనుగా భావిస్తోంది. కానీ, వీరిద్దరూ అందుకు నో అంటున్నారు. పైకి సన్నిహితమని చెబుతూనే..చర్చల ద్వారా ఈ సమస్యను ఎందకు పరిష్కరించే ప్రయత్నం చేయటం లేదు. ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది…ఇద్దరి లక్ష్యం ఏంటి..
జగన్..కేసీఆర్ ఇద్దరి రూటే సపరేటు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్….తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరి రాజకీయ శైలి వేరు. ఇద్దరూ పార్టీ అధినేతలే.సింగిల్ హ్యాండ్ తో అనూహ్య మెజార్టీ దక్కించుకొని సీఎంలు అయ్యారు. 2014 నుండి 2019 వరరకు ఏపీ..తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య ఆధిప్యత పోరు..రకరకాల వివాదాలు కొనసాగాయి. ఓటుకు నోటు కేసు తరువాత మరింత వేడెక్కాయి. ఇక,2019లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఏర్పడింది. ఇద్దరి లక్ష్యం అప్పటి వరకు చంద్రబాబు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఘోరంగా దెబ్బతింది. దీంతో..ఇద్దరు సీఎంలు పలు దఫాలు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ నియంత్రణలో ఉన్న భవనాలను సైతం కేసీఆర్ అడిగిన వెంటనే జగన్ ఓకే చెప్పేసారు.
డైలాగ్ వార్ లేకున్నా కోర్టుల్లో మాత్రం…
ఇక, తెలంగాణ లో ఎరువుల కొరత నివారణలో భాగంగా దిగుమతులక ఏపీ పోర్టులను వాడుకోవటానికి సీఎం జగన్ అంగీకరించారు. ఇక..సమస్యల పైన కేంద్రానికి జోక్యం చేసుకొనే అవకాశం లేకుండా తామిద్దరమే పరిష్కరించు కోవాలనే నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో రాజకీయంగానూ జగన్ కు తెలంగాణ సీఎం పలు సలహాలు ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇటువంటి సమయంలో పోతిరెడ్డిపాడు విస్తర్ణం పెంపు..రాయలసీమ ఎత్తిపోతల పధకం పైన సీఎం జగన్ నిర్ణయం తీసుకోవటంతో..తెలంగాణలో ప్రతిపక్షాలు కేసీఆర్ ను టార్గెట్ చేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇదే అంశం పైన రెండు ప్రభుత్వాలు కేసులు దాఖలు చేసాయి. దీంతో…రెండు రాష్ట్రాల మధ్య డైలాగ్ వార్ లేకున్నా..వాటర్ వార్ మాత్రం కోర్టులకు చేరింది.
ఇద్దరి సీఎంల లక్ష్యం ఒక్కటే…
ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వంతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నయని చెబుతూనే.. తెలంగాణ ప్రయోజనాల్లో మాత్రం రాజీ ఉండదని తేల్చి చెప్పారు. కొద్ది కాలం క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం జగన్ తో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలున్నాయంటూ వ్యాఖ్యానించారు. అటు ఏపీ సీఎం జగన్ సైతం తమకు వచ్చే వాటాను మాత్రమే వాడుకుంటామని..ఎవరికీ నష్టం కలగదని తెలంగాణ లోని రాజకీయంగ వస్తున్న వాదనలకు సమాధానం ఇచ్చారు. తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఇద్దరూ సీఎంలు న్యాయ పరంగా కోర్టుల్లో కేసులు వేసినా..తమ సంబంధాల పైన మాత్రం ప్రభావం ఉండదని చెబుతున్నారు.
బీజేపీ వ్యూహాలకు చెక్
ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఇక్కడ అమలుకు అవకాశం లేకపోయినా..వారికి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకూడదనేది ఇద్దరి అభిప్రాయం. అదే విధంగా ఏపీలో తిరిగి టీడీపీ..తెలంగాణలో బీజేపీ-కాంగ్రెస్ తమకు పోటీగా నిలబడని పరిస్థితులు కలగచేసే విధంగా ఇద్దరూ వ్యూహాలు వేరుగా అమలు చేస్తున్నా..అసలు లక్ష్యం మాత్రం రాజకీయంగా పోటీ లేకుండా చేయటమే. కేంద్ర వ్యవహారాల్లో కొన్నింటిలో కేసీఆర్ విభేదిస్తున్నా..జగన్ మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ ప్రధానితో మాత్రం క్లోజ్ రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని తిరిగి బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు కాచుకొని కూర్చుకున్నారు. అయితే, బీజేపీ మాత్రం ప్రస్తుతానికి అందుకు సిద్దంగా లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజాదరణ కలిగిన నేతలు కావటంతో..సింగిల్ హ్యాండ్ తో అటు ప్రభుత్వాన్ని..ఇటు పార్టీని నడుపుతూ.. ప్రాంతీయ పార్టీలు కీలకం కానున్న రానున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ స్థాయిలోనూ తామే కింగ్ మేకర్లం కావాలనేది ఈ ఇద్దరి అంతిమ లక్ష్యం.