ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ఇప్పుడు హాట్ టాపిక్. మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం జగన్ నోటి నుంచి వెలువడిన నాటి నుంచి రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూపిస్తూ విశాఖ కార్యనిర్వహక రాజధానిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అయితే, ఇదే సమయంలో టీడీపీ అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని ఆకాంక్షిస్తోంది. ఇందుకోసం పోరాటాలు చేస్తోంది. ఇక్కడే ఊహించని ట్విస్టు తెరమీదకు వస్తోంది.
అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించే విషయంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజధాని విషయంలో రాజీనామా డిమాండ్లు ఉపందుకున్నాయి. మూడు రాజధానులు వద్దంటున్న చంద్రబాబు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాభిప్రాయం తెలుసుకోవాలని వైసీపీ నేతలు కోరారు. దీన్ని తిప్పి కొట్టిన టీడీపీ మొత్తం అసెంబ్లీ రద్దు చేసి ఫ్రెష్ మ్యాండేట్కు వెళ్దామని ప్రతిపాదించింది. ఏడాదిన్నర కిందట జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రాంతం అమరావతి సహా రాష్ట్రం అంతా టీడీపీని తుక్కుతుక్కుగా ఓడిస్తే మళ్లీ ఎన్నికలా? కావాలంటే మీరే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు తెచ్చుకోండి అని వైసీపీ తన వైఖరిని తేల్చి చెప్పేసింది.
ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం ఎలా ఉన్నా….సున్నితమైన రాజధాని వ్యవహారంలోకి దూరి తాము ఇబ్బంది పడతామేమోనన్న టెన్షన్ కృష్ణా, గుంటూరు జిల్లాలోని అధికార వైసీపీ ఎమ్మెల్యేలను వేదిస్తోందనే టాక్ తెరమీదకు వస్తోంది. ఈ రెండు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలకు రాజధాని మార్పు ఎఫెక్ట్ తప్పదేమోనన్న టెన్సన్లో ఉన్నారట. ఇదే విషయాన్ని కొందరు సీఎం జగన్ చెవిన వేసినట్లు తెలిసింది. అయితే, ఏపీ ముఖ్యమంత్రి వారికి పూర్తి భరోసా ఇచ్చారని సమాచారం. తాను అభివృద్ధి- సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాని పేర్కొన్న ఆయన అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొంటూ ఇదే ఒరవడిలో మరిన్ని నిర్ణయాలు ఉంటాయనే మాటను చెప్పినట్లు సమాచారం.