అమరవాతి, మార్చి 9: ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చతుష్టయం మహాకుట్ర రచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఐటి గ్రిడ్స్పై దాడి, టిడిపి డేటా చోరీ తరువాత కేసు నమోదు, ముందుగా విజసాయి రెడ్డి ఇసికి లేఖ రాయడం తదితర విషయాలను శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు మిడియాకు వెల్లడించారు.‘ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేశారు, సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నాను, రాష్ట్ర ప్రజలు,దేశ ప్రజలు దీనిపై ఆలోచించాలి’ అని చంద్రబాబు అన్నారు.
దుష్ట చతుష్టయం నరేంద్రమోది,అమిత్ షా, కెసిఆర్,జగన్ బరితెగించి చేసిన కుట్రలు దేశం తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజలు అసహ్యించుకుంటారనీ, ఛీ కొడతారు అనే భయం లేకుండా వీరు ఈ కుట్రలకు దిగారని చంద్రబాబు అన్నారు. వారు ఒక మహా కుట్రకు ఏ విధంగా నాంది పలుకుతారో ఇదే రుజువు అని అన్నారు.
విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 19న ప్రధాన ఎన్నికల అధికారికి ఒక వినతి రాశారనీ అందులో ‘‘ఆంధ్రప్రదేశ్ – ఇల్లీగల్ యాక్సిస్ టు డిజిటల్ డేటా ఆఫ్ ఇండివిడ్యువల్స్ బై తెలుగుదేశం పార్టీ-కంప్లయింట్-యాక్షన్-రిగార్డింగ్ ’’ పేరుతో వినతి రాశారు. ఆ వినతిని తయారు చేసింది ఫిబ్రవరి 19న అయితే ఈసికి ఫిబ్రవరి 22న ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. మరునాడే 23వ తేదీ ఐటి గ్రిడ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సాఫ్ట్ వేర్ కంపెనీపై తెలంగాణ పోలీసులతో చట్ట విరుద్దంగా దాడి చేయించారని చంద్రబాబు అన్నారు.
టిడిపి సేవామిత్ర యాప్ సమాచారం, సభ్యత్వ నమోదు, కార్యకర్తల సంక్షేమ నిధి, ఇన్సూరెన్స్ సమాచారం అంతా చోరీ చేశాని చంద్రబాబు అన్నారు. రాత్రికి రాత్రి అశోక్ ఆఫీస్పై దాడి చేయడం, నలుగురు ఉద్యోగులను బెదిరించడం,వాళ్ల కుటుంబ సభ్యులను వేధించడం అన్నీచేశారని చంద్రబాబు చెప్పారు.
గత నెల 26న టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీనిపై వచ్చింది. ‘‘డేటా బ్రీచ్ బై టిడిపి యాప్..? యుఐడిఏఐ(ఉడాయ్), ఈసి లాంచ్ ప్రోబ్’’ శీర్షికతో వచ్చింది. అందులో ఫిర్యాది విజయసాయి రెడ్డి అని స్పష్టంగా రాశారని చంద్రబాబు తెలిపారు. తాను ఫిర్యాదు చేశానని విజయసాయి ఎందుకని చెప్పలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
తెల్లకాగితాలపై విఆర్ఒ సంతకాలు తీసుకోవడం ఏంటని..? అంటూ కేసు అథెంటిసిటిపైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్లో పేర్కొంది. కేస్ డైరీ చూస్తే, ఇన్వెస్టిగేషన్ పైనే అనుమానాలు ఉన్నాయని హైకోర్ట్ ఆర్డర్ లో పేర్కొందని చంద్రబాబు గుర్తు చేశారు. దీంతో మార్చి మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకల్లా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇంకో ఫిర్యాదు, దశరథరామి రెడ్డి అనే వాడితో మరో ఫిర్యాదురిజిస్టర్ చేస్తారని అన్నారు.
ఈ నెల ఏడున సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర విలేఖరుల సమావేశంలో ఐటి గ్రిడ్స్పై 23వ తేది దాడి, సోదా నిజమేనని ఒప్పుకున్నాడని చంద్రబాబు చెప్పారు. హైకోర్ట్ తప్పు పట్టింది అని సైబరాబాద్ కమిషనర్ విలేఖరుల సమావేశంలో చెప్పరన్నారు. ‘ఫిబ్రవరి 23 ముందే విచారణ చేశామని సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆ విచారణ గురించి సైబరాబాద్ కమిషనర్ ఎందుకు చెప్పలేదని’ చంద్రబాబు ప్రశ్నించారు.
‘ఎవరి ఫిర్యాదుతో ఫిబ్రవరి 22న విచారణ పేరుతో ఐటి గ్రిడ్ కంపెనీపై దాడి చేశారు, ఎవరి ఫిర్యాదుతో కంపెనీలో డేటా తీసుకుపోయారు, అక్కడి ఉద్యోగులను బెదిరించారు, ఆ ఫిర్యాదుదారు విజయసాయి రెడ్డేనా’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఫిబ్రవరి 19న విజయసాయి రెడ్డి రాసిన వినతిలోనే కుట్రకు స్కెచ్ ఉంది. కుట్రకు కార్యాచరణ ప్రణాళిక రాశారు. వినతికి అనుబంధంగా కుట్ర యాక్షన్ ప్లాన్ కూడా ఈసికి అందించారు.
‘రాసుకున్న స్కెచ్ కూడా ఈసికి వినతిలో జత చేశారు. అక్కడే దుష్టచతుష్టయం మహాకుట్ర బైటపడింది. ఈ కుట్ర ‘బాహుబలి’ కుట్రలను మించిపోయిందని’ చంద్రబాబు అన్నారు.
ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ పాయింట్స్, టాకింగ్ పాయింట్స్ కూడా రాశారా లేదా అని ప్రశ్నించారు.
సోదాల్లో ఐటి గ్రిడ్ ఆఫీసులో ఏం చేయాలి, ఎవరెవరిని ఎలా ఇబ్బందులు పెట్టాలి, కుట్ర స్కెచ్ యాక్షన్ ప్లాన్లో అని రాశారని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’’ అంతా అందులో రాసుకున్నారు-సెర్చ్, ఎఫ్ ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, డేటా సీజ్ చేయడం, ఉద్యోగుల సెల్ ఫోన్లు లాగేసుకోవడం, వేధింపులు-బెదిరింపులు,సేవామిత్ర యాప్ ను డిజేబుల్ చేయడం,సేవామిత్ర కీలక కార్యకర్తలను గుర్తించి బెదిరించడం, కోర్ట్ ద్వారా సిబిఐ విచారణ కోరడం, నేషనల్ మీడియా అటెన్షన్ డ్రా చేయడం, సిఈవోకు, ఉడాయ్కు లెటర్స్ పంపాలని అనడం, ఐటి గ్రిడ్ కంపెనీపై సోదాలపై అల్లరి చేయడం….అంతా‘‘ ప్రి-ప్లాన్డ్ కాన్స్ఫిరసి’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
కొందరు మంత్రులను, ఉన్నతాధికారులను, తెలుగుదేశం నేతలను టార్గెట్ చేయాలని రాశారు. దేశ చరిత్రలో ఇంత మహాకుట్ర చూడలేదు,వినలేదు అని చంద్రబాబు అన్నారు.
మార్చి ఎనిమిదిన బిజెపి నేతలు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేసారు. ఈసికి బిజెపి నేతల వినతి లోనూ అదే సమాచారం. మూడు పార్టీల మహాకుట్రకు అదే రుజువు అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈసికి ఇచ్చిన వినతిలో యాక్షన్ ప్లాన్ జత చేయడం ఏమిటి.? కుట్రలకు కూడా యాక్షన్ ప్లాన్ల తయారీనా? ఒక రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర చేస్తారా..? ప్రజలు అభిమానించే ఒక పార్టీపై కుట్ర చేస్తారా అంటూ వైసిపి, బిజెపి, టిఆర్ఎస్ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కుట్రలు,ఆటలు సాగనివ్వమని చంద్రబాబు పేర్కొన్నారు. మూడు పార్టీల కుట్రలకు ప్రజలే బుద్ది చెబుతారని చంద్రబాబు అన్నారు.