Revanth Reddy Effect: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి జూలై 7వ తేదీన పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులను తోసి రాజని టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడంతో పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు హార్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడుగా డిక్లేర్ చేయడంతో సీనియర్ కాంగ్రెస్ నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన శశిధర్ రెడ్డి తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.
Read More: MAA Polls: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంచు విష్ణు మనోగతం ఇది..!!
మరో పక్క టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన సీనియర్ నేత, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీపీగా టీపీసీసీ మారిపోతుందని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు మాదిరిగా పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్నారని త్వరలోనే అధారాలతో సహా బయట పెడతానని అన్నారు. శవాల మధ్య సోనియా గాంధీ విగ్రహం పెట్టాలన్న వ్యక్తికి పీసీసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పార్టీలో యాక్టివ్ గా ఉన్న ఫిరోజ్ ఖాన్ కు పదవి ఇవ్వకుండా మూడేళ్లుగా గాంధీ భవన్ కు రాని అజహరుద్దీన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల వరకూ గాంధీ భవన్ మెట్లెక్కనని అన్నారు. టీడీపీ నుండి వచ్చిన నేతలు ఎవరూ తనను కలవవద్దని అన్నారు. నూతన అధ్యక్షుడుతో సహా ఆ కమిటీ నేతలు తనను కలవాలని ప్రయత్నించవద్దని సూచించారు.
తన నియోజకవర్గం, జిల్లా కే పరిమితం అవుతాననీ, తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారన్నారు. సోనియా, రాహుల్ పై విమర్శలు చేయనని పేర్కొన్న కోమటిరెడ్డి.. సోమవారం నుండి ఇబ్రహీంపట్నం నుండి భువనగిరి వరకూ పాదయాత్ర చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త నాయకత్వంలో హుజూరాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. టీపీసీసీలో అసలైన కార్యకర్తలకు గుర్తింపు లేదని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలకుపైగా పార్టీలో ఉన్న తనను నూతన కమిటీ ఏర్పాటు విషయంపై కనీసం సంప్రదించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.