మన అందచందాలు ఎవరికీ తెలిసినా తెలియకున్నా, పడగ్గదిలోని అద్దానికి కచ్చితంగా తెలుస్తాయి కదా! రోజూ తెల్లవారకముందే వెళ్లి మన ముఖారవిందం ఎంత సుందర ముదనష్టంగా ఉందో చూసుకునేది ఆ అద్దంలోనేగా! దానికి తెలియకపోతే ఎవరికీ తెలుస్తుంది, మన రూపురేఖావిలాసాల గురించి! అలాగే, మనరాజకీయ నాయకులు అయిదేళ్లకి ఒకసారి తమ సౌందర్యం ఎంత గొప్పగా ఉందో చూసుకునే అద్దం పేరే ఎన్నికలు. ఈ ఎన్నికల్లోనే మన కాబోయే పాలకుల “ఎలక్షణాలు” ఏపాటి సుందరంగా ఏడ్చాయో పాలితులకి తేటతెల్లం అయిపోతుంది కూడా. పాపం, అద్దానికి సొంత బుర్ర ఉండదు! మన మొహం ఎలా ఉందో అచ్చం అలాగే చూపిస్తుంది పిచ్చి అద్దం. మన ఓటర్లు కూడా అంతే!
మనం ఏదేదో ఆదర్శాల గిఫ్ట్ రాపర్లు చుట్టి, ఎన్నికల ప్రణాళికలు పంచరంగుల్లో ముద్రించి వాళ్ళ దగ్గిరకి పట్టుకుని వెళ్తామా- వాళ్ళు ఆ రాపర్లను పరపరా మనకళ్లముందే చించేస్తారు. ఈ నియోజకవర్గంలో “మన”వాళ్లదే తిరుగులేని మెజారిటీ అని తొడ చరిచి చెప్తారు. కాస్త ఖర్చులకి పడేస్తే, “మన వాళ్ళు” అందరూ “మన” కే గుద్దేస్తారని భరోసా ఇస్తారు. వీలయితే పోలింగు రేపనగా ఇవాళ “పారాణీ- గోరింటాకు” పథకం కింద ఇంకో పదివేలు బ్యాంకు అకౌంట్లో వేయించాయినట్లయితే “మన” మెజారిటీ లక్షకి తగ్గదని ఢంకా బజాయించి చెప్తారు. అవతల సీన్ ఇంతకూ భిన్నంగా ఏం ఉండదు! సర్కారీ పార్టీ బాంక్ అకౌంట్ లో ఎన్నివేలు జమ చేసిందో, “మనమూ” అంతకు ఒక్కపైసా తగ్గడానికి వీల్లేదని మీసం మెలేసి చెప్తారు. ఓటుకు పదివేలు ఎలాగు ఇవ్వక తప్పదు కనక, అదేదో ఒకేసారి ఇచ్చేస్తే, ఏ ఫ్రిజ్జో ఏ ఏసీయో కొనుక్కుని వచ్చే ఎన్నికల వరకూ “మన” పేరే చెప్పుకుని తరిస్తారని ఉచిత సలహా పారేస్తారు. పోలింగు జరగడానికి ముందురోజు మట్టుకు మందు పంచవద్దని హెచ్చరిస్తారు. పొతే, మూటలు మోసుకుని వెళ్లే వాళ్లకి మూటకింతని ముందే ముట్టచెప్తే ఎక్కడికక్కడ నొక్కేయడం తగ్గుతుందని హితవు చెప్తారు. ఎంతైనా “మన” శ్రేయోభిలాషులు “మన”వాళ్ళు! ఎవరి దగ్గిరైనా మన నేతల గుణగణాలు దాగుతాయేమో గానీ (ప్రతిఫలం పుచ్చుకుని మరీ ) ఓటు వేసి ఎన్నుకునే సామాన్యుడి ముందు దాగవుగా!
దీన్నిబట్టి ఒక విషయం స్పష్టం అవుతుంది. మన ఎన్నికలలో పోటీ జరిగే మాట వాస్తవం. నిజంగా బలమైన, సమర్ధుడైన అభ్యర్థి మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించగలడు అనడంలో సందేహం లేదు. ఓటర్లు కూడా తమకు నచ్చిన, తాము మెచ్చిన అభ్యర్థులనే ఎన్నుకునే మాట కూడా వాస్తవం. అంతేకాదు, వేరే ఎక్కడైనా స్త్రీలకూ సంపూర్ణ స్వేచ్ఛ ఉందోలేదో చెప్పలేం గానీ, ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మాత్రం “మన ” ఆడపడుచులకు నూటికి నూరుపాళ్లు స్వేచ్ఛ ఉంది! ఎటొచ్చీ, ఆ పోటీ ఎందులో అని మాత్రం అడక్కండి- డబ్బు, మందు, జబ్బబలం లాంటి వాటికే ఆ పోటీ పరిమితమని చెప్పక తప్పదు. అభ్యర్థుల సామర్థ్యం ఎందులో అని మాత్రం అడక్కండి- కులవాదాన్ని కుళ్లగించడం, మతవాదాన్ని ప్రేరేపించడం, ప్రాంతీయ వాదం రెచ్చగొట్టడం లాంటి వాటికే ఆ సామర్థ్యం పరిమితమని చెప్పక తప్పదు. వోటర్లకున్న స్వేచ్ఛ ఎందులో అని మాత్రం అడక్కండి- కుల గజ్జి ప్రదర్శించడం , మత పిచ్చి చూపించడం, ప్రాంతీయ ద్వేషం విషం కక్కడం లాంటి వాటికే ఆ స్వేచ్ఛ పరిమితమని చెప్పక తప్పదు. ఆకాశంలోనే కాదు, పాతాళంలోనూ సగమే అయినా మన ఆడపడుచులు ఎందులోనూ తక్కువ “తినడం” లేదని సిగ్గుతో ఒప్పుకోక తప్పడం లేదు.
ఇక్కడిదాకా చదివి, నన్ను ఎన్నికలను వ్యతిరేకించే వాడిగా మాత్రం పొరబడకండి! ప్రజాస్వామ్యం మనుగడ సాగించడానికి కచ్చితంగా ఎన్నికలు అవసరమేనని నాకూ తెల్సు . ఎన్నికల ద్వారా మాత్రమే, పాలకుల పట్ల పాలితుల విశ్వాసం వెల్లడయ్యే అవకాశం ఉంటుంది అని కూడా నాకు బాగా తెలుసు. పాలకుల విధానాలకు పాలితుల అనుమతి పొందడానికి ఎన్నికలు తప్పితే మరో అవకాశం -మన వ్యవస్థలో- లేదనీ నాకు తెలుసు. అయితే, ప్రజాస్వామ్యం మనుగడకి ఎన్నికలే సర్వస్వం అనుకోడం కన్నా బాల్యం మాత్రం మరొకటి ఉండదు. ఎందుకంటే, మన ఎన్నికల్లో ఏపాటి ప్రజాస్వామ్యం ఉందో మన ఓటరు మహాశయులకు బాగా తెలుసు. డబ్బు, మందు, కులగజ్జి, పార్టీవ్రత్యం వగైరాలు ప్రధాన పాత్ర వహించే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం మనుగడను పొడిగించే విషయాలు ఏమున్నాయి? “ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు. ప్రజాస్వామ్యమంటే మన జీవిత సర్వస్వమూనూ ” అన్నారట సాయి యింగ్వెన్. చాంగ్ కై షేక్ నీడలో రూపు దిద్దుకున్న తైవాన్ లో రాణించిన నాయకురాలికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మిగతా వాళ్ళ కన్నా బాగా తెలిసే అవకాశం ఎక్కువ. పైగా, ఆమె చెప్పిన మాట మన దేశంలో కుహనా ప్రజాస్వామ్య వాదులందరూ మనసులో పెట్టుకోవలసిన అక్షర సత్యం.
– మందలపర్తి కిషోర్
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ