ముంబై యువకుడి గిన్నిస్ రికార్డు
ముంబై: రూబిక్స్ క్యూబును తక్కువ సమయంలో ఛేదించేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ నీళ్లలోపలకు వెళ్లి, అక్కడ దాన్ని సరిచేయాలంటే సాధ్యమవుతుందా? అసాధ్యమనుకున్న దీన్ని సుసాధ్యం చేసి ముంబైకి చెందిన చిన్మయ్ ప్రభు (20) గిన్నిస్ రికార్డు స్థాపించాడు. కేవలం ఒక నిమిషం 48 సెకండ్లలో దీన్ని ఛేదించాడు. గత సంవత్సరం డిసెంబరు 9వ తేదీన ఒక స్విమ్మింగ్ పూల్ నీటి అడుగున ఈ ఛాలెంజ్ పూర్తిచేశాడు. ఈ సంవత్సరం మార్చి 15న అతడికి సర్టిఫికెట్ వచ్చింది.
తనకు క్యూబింగ్ చేయడంతో పాటు ఈత కూడా ఇష్టమని, అందుకే ఆ రెండింటినీ కలిపి కొత్త రికార్డు చేయాలనుకున్నానని ప్రభు చెప్పాడు. ఇప్పటివరకు అలాంటి రికార్డు ఏదీ గిన్నిస్ బుక్ లో లేకపోవడంతో ముందుగా వారిని సంప్రదించి, కొత్త టైటిల్ పెట్టాలని కోరాల్సి వచ్చిందన్నాడు. మొదట కేవలం 30 – 35 సెకండ్ల పాటే నీళ్లలో ఊపిరి పీల్చుకోకుండా ఉండగలిగేవాణ్నని, తర్వాత క్రమంగా ఆ సమయాన్ని ఒకటిన్నర నిమిషాలకు పెంచానని చెప్పాడు.
నాలుగు పిరిమింక్సులను ఛేదించాలని గిన్నిస్ ప్రతినిధులు అతడికి లక్ష్యంగా పెట్టారు. కానీ అతడు ఏకంగా తొమ్మిదింటిని ఛేదించాడు. నాలుగు లేదా ఐదింటిని ఛేదిస్తే తన రికార్డును వేరే ఎవరైనా బద్దలుకొట్టే అవకాశం ఉందని, అందుకే తొమ్మిదింటిని తీసుకున్నానని ప్రభు తెలిపాడు. ఈ లక్ష్యసాధన కోసం ఐదు నెలలుగా అతడు కఠోర శిక్షణ తీసుకున్నాడు. 2017లో ఇదే రకంగా మిర్రర్ క్యూబ్ ఛేదించి లిమ్కా బుక్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం అతడు క్యూబింగులో ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు. వారాంతాల్లో చాలామందికి చెబుతానని, తన వద్ద నాలుగేళ్ల కుర్రాడు కూడా నేర్చుకుంటున్నాడని అన్నాడు. తమ కొడుకు ఇంత దూరం వెళ్తాడని అనుకోలేదని ప్రభు తండ్రి ప్రదీప్ చెప్పారు. అతడికి ఆసక్తి ఉండటంతో క్యూబింగును ప్రోత్సహించామని, కానీ ఇంత పెద్ద స్థాయికి ఎదుగుతాడని అనుకోలేదని ఆయన అన్నారు.