మూడేళ్ల క్రితం 4జీ సేవలతో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు తెర తీసింది రిలయన్స్ జియో. తాజాగా రిలయన్స్ 42వ వార్షికోత్సవ సమావేశంలో ముఖేష్ అంబానీ మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. జియో ఫైబర్ ద్వారా అధికవేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, అపరిమిత దేశీయకాల్స్ సౌకర్యంతో పాటు చౌకగా విదేశీ కాల్ సేవలు అందించబోతున్నట్లు ప్రకటించారు.
ఒకే కనెక్షన్తో ల్యాండ్ లైన్, సెట్ టాప్ బాక్స్ సేవలను రిలయన్స్ అందిస్తుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ నుండి సినిమా విడుదలైన తొలిరోజునే సెట్ టాప్ బాక్స్ ద్వారా ఇంట్లో కూర్చుని సినిమా చూసే అవకాశం కలుగచేస్తామని ప్రకటించడం గమనార్హం. ఇది జనానికి ఎంతైనా బాగుంటుంది. కానీ, ఇబ్బంది అంతా సినిమా జనాలకే. సినిమా విడుదల రోజునే సెట్ టాప్ బాక్స్ ద్వారా ఇంట్లో కూర్చుని సినిమా చూసే అవకాశం వస్తే.. అసలు ప్రేక్షకులు థియేటర్కి వస్తారా? ఈ చర్చలు ఇప్పటికే ఫిల్మ్ నగర్లో సాగుతున్నాయి. వాస్తవానికి, ఇప్పటికే నెట్ఫ్లిక్స్, అమెజాన్ వంటి సంస్థల కారణంగా సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు జియో ఫైబర్ సెట్ బాక్స్ పథకం అమలులోకి వస్తే ప్రేక్షకుడు థియేటర్కు రావడం గత వైభవంగానే మిగులుతుందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.
తాజా రిలయన్స్ పథకాల ద్వారా నిర్మాతలకు సినిమా విడుదలకు ముందే రైట్స్ రూపంలో ఎంతో కొంత డబ్బులు దక్కుతాయని అనుకుందాం. అంతవరకూ నిర్మాత సేఫ్ అనుకున్నప్పటికీ, సినిమానే నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్ యాజమాన్యం తదితరులు జియో ఫైబర్ ద్వారా ఉపాధినే కొల్పోయే ప్రమాదం ఉంది. ఒకప్పుడు `విశ్వరూపం` సినిమాను నేరుగా డి.టి.హెచ్ ద్వారా విడుదల చేస్తానని కమల్ ప్రకటిస్తే.. అతనిపై డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరూ పెద్ద యుద్ధమే ప్రకటించారు. మరిప్పుడు రిలయన్స్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి సినిమా పరిశ్రమలు ఏమంటాయి? అసలు ఈ పథకం గురించి వారికి ముందుగా ఏమైనా ఉప్పందిందా? లేదా? ఒకవేళ ముందు తెలియకపోయినా… ఇప్పుడు తెలిశాక వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి? ఈ విషయాలు తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడాల్సిందే.
previous post
next post