అమరావతి: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చివరికి ప్రధానమంత్రిని ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్ కోసం దీర్ఘకాలంగా పోరాడుతున్న ముద్రగడ ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర వద్ద పెండింగ్లో ఉన్న కాపులకు అయిదు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ఆయన ప్రధానిని కోరారు.
మంగళవారం ముద్రగడ ప్రధానికి పంపిన లేఖలో పేర్కొన్న ఆంశాలు.
బ్రిటిష్ పాలనలో కూడా 1915 నుంచి గజిట్ నంబర్ 67 కింద కాపు, బలిజ, వంటరి, తెలగ కులాలకు బిసిలుగా రిజర్వేషన్ కల్పించారు. 1956 వరకూ ఈ రిజర్వేషన్ కొనసాగింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాపులకు ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేశారు.
1961లో దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పైన చెప్పిన కులాలకు జివో నంబర్ 3250 కింద మళ్లీ రిజర్వేషన్ కల్పించారు.
1964లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి మళ్లీ కాపులకు రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేశారు.
గత 50 ఏళ్లుగా అన్ని రాజకీయ పార్టీలూ రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తామని కాపులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చి పబ్బం గడుపుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోతున్నాయి.
2017 డిసెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాపులకు బిసి (ఎఫ్) కింద 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 33/2017 బిల్లు శాసనసభలో ఆమోదింపజేశారు. దానిని గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం పంపారు. ఇది ఇంకా అక్కడే పెండింగ్లో ఉంది. దయచేసి దానిని ఆమోదించిపంపగలరు.