(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తెలంగాణలో ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో పదవులు దక్కక తీవ్ర అసంతృప్తికి గురయిన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. మంత్రి పదవి దక్కుతుందేమోనని గంపెడాశలతో ఎదురు చూసిన ఆశావహులు తీరా.. కేబినెట్లో చోటు దక్కకపోవడంతో బహిరంగంగానే తమ అసంతృప్తి గళం వినిపించారు. కేసీఆర్ తనకు మాట ఇచ్చి మోసం చేశారని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయని నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు టీఆర్ఎస్ కి తాను కూడా ఓనర్ నే అంటూ.. కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ కామెంట్ చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యతోపాటు మరికొంత మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తాజాగా అసంతృప్తి నేతలంతా సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు బహిరంగంగా విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు మాట మార్చేస్తున్నారు.
పార్టీలో అసమ్మతిని గ్రహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అసంతృప్తి నేతలకు బుజ్జగింపులు మొదలు పెట్టారట. కేటీఆర్ ద్వారా నాయినికి నచ్చ చెప్పారు. అయితే, ఏం హామీ దక్కిందో తెలియదు కానీ నాయిని ఇప్పుడు చల్లబడ్డారు. తాను చిట్ చాట్ గా మాట్లాడితే.. మీడియా వాటిని హైలెట్ చేసిందని తాజాగా ఆయన చెప్పడం గమనార్హం. అంతేకాదు.. తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని చెప్పారు. ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దన్న నాయినీ… ఇప్పుడు మాట మార్చడం చర్చనీయాంశమైంది.
మరోవైపు కేబినెట్ విస్తరణ భాగంగా మంత్రి పదవులు దక్కని నేతలను కూడా అధిష్టానం బుజ్జగిస్తోంది. పదవిపై ఆశలు పెట్టుకొని భంగపడ్డ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పలు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మారాలనుకున్న నేతలు కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, మైనంపల్లి హనుమంతరావు, అరికెపూడి గాంధీ, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను అధిష్టానం బుజ్జగించినట్టు తెలుస్తోంది. అసంతృప్తి నేతలకు స్వయంగా సీఎం కేసీఆరే ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మంచి పదవులు ఇస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో అసమ్మతి గళం విప్పిన నేతలు ఒక్కక్కొరు నెమ్మదించినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.